రూ.200 కోట్ల ఆర్థిక మోసం కేసులో అరెస్టయిన సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీలోని మండోలీ జైలులో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ జైళ్ల శాఖ జైలులోని ఆయన గదిలో తనిఖీలు చేపట్టగా, ఖరీదైన వస్తువులు లభ్యమయ్యాయి. ఇందులో రూ.1.50 లక్షల విలువైన చెప్పులు, రూ.80 వేల రెండు జీన్స్లు ఉన్నట్లు అధికారులు గురువారం తెలిపారు. ఈ తనిఖీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. ఇందులో సుకేశ్ జైలు అధికారుల ముందు విలపిస్తున్నట్లు కనిపిస్తోంది. మరో కొత్త మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత వారం సుకేశ్ను అరెస్టు చేసింది. రాన్బాక్సీ మాజీ ప్రమోటర్ మల్విందర్ సింగ్ను జైలు నుంచి విడిపిస్తానంటూ అతని భార్యను రూ.3.5 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఈడీ తాజాగా అభియోగాలు మోపింది. గత వారం జైలు నుంచి అతన్ని అదుపులోకి తీసుకుని, ఢిల్లీ కోర్టులో హాజరుపర్చింది. కోర్టు అతనికి తొమ్మిది రోజుల ఈడీ కస్టడీ విధించింది. గతంలో ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న సమయంలోనూ మొబైల్ ఫోన్ వినియోగానికి, ఖరీదైన వసతులు కల్పించేందుకు వీలుగా జైలు సిబ్బందికి సుకేశ్ ప్రతి నెలా రూ.కోటి లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.
జైలు గదిలో సుకేశ్ చంద్రశేఖర్ విలాసం !
February 23, 2023
0
Tags