తెలంగాణ సాగునీటి పథకాలను మెచ్చిన భగవంత్‌ సింగ్‌ మాన్‌ !

Telugu Lo Computer
0


తెలంగాణలో చేపట్టిన సాగునీటి పథకాలు బాగున్నాయని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ ప్రశంసించారు. రాష్ట్రంలోని భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. కొండపోచమ్మ సాగర్‌తో పాటు గజ్వేల్‌లోని పాండవుల చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్‌తో నీటిపారుదలశాఖ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, ప్రాజెక్టు నిర్మాణం తీరు, వివిధ దశలను వివరించారు. అలాగే రాష్ట్రంలో చేపట్టిన జలవనరుల పథకాలను మ్యాప్‌లు, చార్జులతో వివరించారు. ఈ సందర్భంగా పంజాబ్‌ సీఎం రాష్ట్రంలో చేపట్టిన చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. భూగర్భ జలాలను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను ఇచ్చాయని చెప్పారు. పంజాబ్‌లో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయని, ఆయా కార్యక్రమాలను పంజాబ్‌లోనూ అమలు చేయనున్నట్లు వివరించారు. పంజాబ్‌ సీఎంతో పాటు ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారుల బృందం రాష్ట్రంలోని మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యాంల నిర్మాణం, కాలువలు, చెరువులు, చిన్న నీటి వనరుల నిర్వహణ, ఫలితాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం చర్యలతో తెలంగాణలో భూగర్భ జలాలు దాదాపు 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వ అధ్యయనాల్లో తేలింది. దీంతో పంజాబ్‌ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమాలు అమలు చేసేందుకు ఆ రాష్ట్ర అధికారులు భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)