వ్యక్తిని నరికి తలతో సెల్ఫీ !

Telugu Lo Computer
0


ఝార్ఖండ్‌ లో భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని సమీప బంధువులే అత్యంత కిరాతకంగా తలనరికి చంపేశారు. అనంతరం ఆ తలతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఖుంతీ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి ఖుంతీ సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి అమిత్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం ఖుంతీ జిల్లాలోని ముర్హూ ప్రాంతానికి చెందిన దేశాయి ముండాకు అతని మేనల్లుడు సాగర్‌ ముండాతో భూ వివాదాలు ఉన్నాయి. అయితే, ఆదివారం రోజు దేశాయి ముండా కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న దేశాయి కుమారుడు కాను ముండాను సాగర్‌తోపాటు అతని స్నేహితులు కిడ్నాప్‌ చేశారు. సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి తిరిగొచ్చిన దేశాయి కుటుంబ సభ్యులకు ఇంట్లో కాను ముండా కనిపించలేదు. దీంతో తన కుమారుడిని తన మేనల్లుడు, అతని స్నేహితులు కిడ్నాప్‌ చేశారని దేశాయి ముండా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాగర్‌ ముండాను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. నిందితులు చెప్పిన ఆధారాల మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు కుమాంగ్‌ గోపాల్‌ ఫారెస్ట్‌లో కాను ముండా శరీరభాగాన్ని (మొండెం) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి అమిత్‌ కుమార్‌ తెలిపారు. మొండెంకు 15 కిలోమీటర్ల దూరంలోని దుల్వా గుంగ్రీ ప్రాంతంలో కాను తలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నేరం అనంతరం నిందితులు నరికిన తలతో సెల్ఫీ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలి వద్ద ఆరు సెల్‌ ఫోన్లు, రక్తపు మరకలతో కూడిన రెండు పదునైన ఆయుధాలు, ఒక గొడ్డలి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)