తమ ప్రభుత్వ హయాంలో సాధించిన లక్ష్యాలను బిజెపి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటూ, అసత్యాలను ప్రచారం చేస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఫరూక్ అబ్దుల్లా మండిపడ్డారు. అసత్య ప్రచారాలు, వాస్తవాలు రెండూ వేర్వేరు అంశాలని పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్లో గత ప్రభుత్వాలు చెత్త పాలన సాగించాయని, ప్రజలకు ఉద్యోగాలు, చేతుల్లో రాళ్లు, తుపాకులు ఉంచాయని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. తమ పాలనలో జమ్ముకాశ్మీర్ అభివృద్ధి పదంలో నడిచిందని, ప్రజలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సాధికారతను సాధించారని పేర్కొన్నారు. భారీ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. గత 35 ఏళ్లలో తన సహోద్యోగులు తమ జీవితాలను త్యాగం చేశారని, తుపాకుల తూటాలకు ఎన్సి నేతలు, కార్యకర్తలు బలయ్యారని, చాలా మంది గాయపడ్డారని అన్నారు. ఆ తుపాకులను తాము పంపిణీ చేసినట్లు అమిత్ షా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగిందనేది అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
అసత్యాలను ప్రచారం చేస్తోన్న అమిత్షా
October 07, 2022
0
Tags