హైదరాబాద్ లోని బహదూర్పుర ఠాణాలో చార్మినార్ ఏసీపీ భిక్షంరెడ్డి, బహదూర్పుర ఇన్స్పెక్టర్ సుధాకర్తో కలసి దక్షిణ మండల డీసీపీ పి.సాయిచైతన్య మీడియాకు వివరించిన దాని ప్రకారం పహడీషరీఫ్ నివాసి మహ్మద్ జుబేర్ (38)పై రాజేంద్రనగర్ ఠాణాలో రౌడీషీట్ ఉంది. కొద్దిమంది యువకులను చేరదీసి ముఠా తయారు చేశాడు. 2014లో జరీనాబేగాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతుల మధ్య మనస్పర్థలున్నాయి. జరీనాబేగం మేనమామ మహ్మద్ బాబూఖాన్(38), జుబేర్ మధ్య వ్యాపార లావాదేవీల్లో గొడవలున్నాయి. వీరిద్దరూ పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్లుగా కొనసాగుతున్నారు. గతంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇద్దరి అనుచరులు హత్యకు గురయ్యారు. భర్త వేధింపులు భరించలేని జరీనాబేగం పుట్టింటికి చేరింది. భర్త ఫోన్చేసి వేధించటంతో తన మేనమామతో చెప్పి లోకంలో లేకుండా చేస్తానంటూ బెదిరించింది. దీన్ని మనసులో పెట్టుకున్న జుబేర్ ఈనెల 14న హస్సన్నగర్ సలీమా హోటల్ వద్ద ఉన్న బాబూఖాన్పై తన అనుచరులతో కలసి కత్తులు, ఇనుప పైపులతో దాడి చేసి హతమార్చారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బహదూర్పుర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన రాహుల్ రాజు తడాస్(24) ఈ కేసులో రెండో నిందితుడు. ఈ ఏడాది ఏప్రిల్లో అక్కడ ఓ వ్యక్తిపై దేశవాళీ తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకొని హైదరాబాద్ చేరాడు. తనకున్న పరిచయాలతో జుబేర్ ముఠాలో చేరాడు. బాబుఖాన్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా రాహుల్రాజు నేరచరిత్ర వెలుగుచూసింది. ఈ కేసులో మహ్మద్ జుబేర్(38), రాహుల్రాజు తడార్(24), మహ్మద్ ఓమర్ఖాన్(35), మహ్మద్ ఉస్మాన్(34), మహ్మద్ ఖదీర్(38), మహ్మద్ ఇమ్రాన్(36)లను అరెస్ట్ చేశారు. 4 కత్తులు, 2 దేశవాళీ పిస్తోళ్లు, 6 బుల్లెట్లు, ఆటో, ద్విచక్రవాహనం, 6 మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Post a Comment
0Comments
3/related/default