బలమైన కార్పొరేట్ ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఆద్యంతం ఉత్సాహంగా చలించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. దీంతో వరుసగా నాలుగో సెషన్లోనూ లాభాల జోరు కొనసాగింది. రూపాయి ఇటీవల కనిష్ఠాల నుంచి తిరిగి కోలుకోవడం కూడా మదుపర్ల సెంటిమెంటును పెంచింది. మరోవైపు జులై నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, తయారీ కార్యకలాపాలు 8 నెలల గరిష్ఠానికి చేరడం సూచీలకు బలాన్నిచ్చింది. విమాన ఇంధనం, వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గడం సైతం మార్కెట్ల ర్యాలీకి కొంత కలిసొచ్చింది. రిలయన్స్, ఎస్బీఐ వంటి దిగ్గజ షేర్లు రాణించడం కూడా మార్కెట్ల లాభాలకు తోడైంది. నిఫ్టీ ఉదయం 17,243.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,356.25 వద్ద గరిష్ఠాన్ని, 17,154.80 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 181.80 పాయింట్లు లాభపడి 17,340.05 వద్ద స్థిరపడింది. 57,823.10 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 58,170.67 - 57,540.36 మధ్య కదిలింది. చివరకు 545.25 పాయింట్లు ఎగబాకి 58,115.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఆరు షేర్లు మాత్రమే నష్టపోయాయి. సన్ఫార్మా, హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ షేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. ఎంఅండ్ఎం, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, మారుతీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రో, ఐటీసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డ వాటిలో ఉన్నాయి.
లాభాల జోరులో స్టాక్ మార్కెట్లు
August 01, 2022
0
Tags