ఉత్తరప్రదేశ్ లోని తాజ్ మహల్లో శ్రీకృష్ణుడి చిత్రం పెట్టిన స్థలంపై వివాదం రాజుకుంది. స్మారక చిహ్నం తాజ్ లోపల ఉన్న ఫొటో గ్యాలరీని తరలించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి తాజ్ మహల్ వెలుపల ధర్నాకు దిగారు. రాధా-కృష్ణుల ఫోటోను వాష్రూమ్కు సమీపంలో ఉంచారని, దీన్ని మార్చమని మత్స్యేంద్ర గోస్వామి నిరసన చేపట్టారు. దీంతో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) గోస్వామి డిమాండ్కు అంగీకరించి, తాజ్ మహల్ లోపల శ్రీకృష్ణుడి బొమ్మను మార్చింది. పిక్చర్ గ్యాలరీని నిర్వహిస్తున్న ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ)కి అవసరమైన మార్పులు చేయాలని కోరారు.ఏఎస్ఐ ఆగ్రా సూపరింటెండెంట్ ఆర్కే పటేల్ మాట్లాడుతూ ఈ గ్యాలరీని ఐటీడీసీ రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిందన్నారు. గ్యాలరీలోని చాలా చిత్రాలు కాలక్రమేణా అరిగిపోయాయని పటేల్ తెలిపారు. కాగా ఈ వివాదంపై ఆగ్రా టూరిస్ట్ వెల్ఫేర్ ఛాంబర్ సెక్రటరీ విశాల్ శర్మ మాట్లాడుతూ తాజ్ మహల్కు సంబంధించి ఇలాంటి పనికిమాలిన వివాదాలను లేవనెత్తడం ద్వారా భారతదేశ ప్రతిష్ఠను పాడుచేస్తున్నారన్నారు.తాజ్మహల్కు సంబంధించి ఇలాంటి అనవసర వివాదాలు లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించినందుకు కేసు నమోదు చేయాలని శర్మ డిమాండ్ చేశారు.
శ్రీకృష్ణుడి చిత్రంపై రాజుకున్న వివాదం
June 03, 2022
0
Tags