కాశ్మీర్ లోయలో సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని జరుగుతోన్న వరుస హత్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి . తాజాగా సొంత పార్టీ నేత సుబ్రమణ్య స్వామి కూడా మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కాశ్మీర్ ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు క్రీడాశాఖ అయితే బాగుంటుందంటూ ఎద్దేవా చేశారు. ''జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అక్కడ నిత్యం ఓ కశ్మీరీ హిందువు హత్యకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆయనకు క్రీడల శాఖ అప్పగిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో క్రికెట్కు అనవసర ఆదరణ బాగా పెరిగింది'' అంటూ స్వామి ట్విటర్ వేదికగా హోంమంత్రిపై విమర్శలు చేశారు. అమిత్ షాను టార్గెట్ చేస్తూ స్వామి గతంలో కూడా విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన టీ20 మెగా క్రికెట్ టోర్నీ పై ఈ భాజపా ఎంపీ స్పందిస్తూ.. అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ''టీ 20 మెగా టోర్నీ ఫలితాల్లో రిగ్గింగ్ (మ్యాచ్ ఫిక్సింగ్) జరిగినట్లు నిఘా సంస్థల్లో అనుమానాలున్నాయి. వీటిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలనుకుంటున్నా. ఎందుకంటే భారత క్రికెట్ బోర్డుకు అమిత్ షా కుమారుడు 'నియంత'గా ఉన్నందున ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోదు'' అని స్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అమిత్ షా రాజీనామా చేయాలి
June 03, 2022
0