ఆంధ్రప్రదేశ్ లో రెండో భాషగా ఉర్దూ!

Telugu Lo Computer
0


ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటీ అయింది. కేబినెట్ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలు, సభలో ప్రవేశపెట్టే ఇతర బిల్లులపై మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఈ సమావేశం ప్రారంభం కాగానే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డికి మంత్రి మండలి రెండు నిమిషాల పాటు నివాళులర్పించింది. ఉద్యోగుల వయో పరిమితి వయస్సు 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదన బిల్లుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  ఏపీ అధికార భాషా చట్టం 1966 సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉర్దూను రెండో భాషగా గుర్తిస్తూ చట్ట సవరణ చేయనున్నారు. 35 అజెండా అంశాలపై ఏపీ కేబినెట్‌లో చర్చించింది. జిల్లాల విభజనకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలపై మంత్రివర్గం చర్చించింది. స్టేట్‌ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో 8 రెగ్యులర్, 4 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసుకున్న వారికి తెలుగుతో పాటుగా ఉర్ధూను సెకెండ్‌ లాంగ్వేజ్‌గా చదువుకునేందుకు అవసరమైన చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. కర్నూలుకు చెందిన ఇండియన్‌ డెఫ్‌ టెన్నిస్‌ కెప్టెన్, 2017 డెఫ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత షేక్‌ జాఫ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ అంగీకరించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో గోదాముల నిర్మాణానికి స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు బిల్లుకు మంత్రి మండలి ఆమోదించింది. తూనికలు, కొలతలశాఖలో నిబంధనలు అమలు కోసం మెరుగైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. డిప్యూటీ కంట్రోలర్‌ పోస్టును జాయింట్‌ కంట్రోలర్‌(అడ్మిన్‌) పోస్టుకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. రూ.1234 కోట్లతో మూడు ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం, రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి రూ.8741కోట్ల రుణ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. బెంగుళూరు-కడప, విశాఖపట్నం-కడప నడుమ వారానికి మూడు విమాన సర్వీసులు నడపాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే కడప నుంచి పలు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వీటికి అదనంగా కొత్త సర్వీసులకు ఆమోదం తెలిపింది. మార్చి 27 నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇండిగోతో ఏపీఏడీసీఎల్‌ ఒప్పందం చేసుకోనుంది. సర్వీసులు మొదలైన తర్వాత ఏడాదికి రూ.15 కోట్ల మేర మద్ధతు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు -2 కింద చెరువులకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం బైపాస్‌ కాలువ నిర్మాణం చేపట్టనుంది. ఇందుకు రూ.214.85 కోట్ల ఖర్చు ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదించింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పడతదిక గ్రామం వద్ద ఉప్పుటేరుపై 1.4 కిలోమీటర్ల మేర రెగ్యులేటర్‌- బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)