నేటి నుంచి తమిళనాడులో కేసీఆర్ పర్యటన.

Telugu Lo Computer
0


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా రెండు రోజులపాటు యాత్ర సాగనుంది. ముందుగా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మంగళవారం రోజు సీఎం కేసీఆర్.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్​తో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ తిరుచిరాపల్లి వెళతారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి మధ్యాహ్నం తర్వాత రంగనాథస్వామిని దర్శించుకుని, విమానాశ్రయానికి తిరుగుప్రయాణమవుతారు. అక్కడి నుంచి చెన్నైకి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం తమిళనాడు సీఎం స్టాలిన్​తో సీఎం కేసీఆర్ భేటీ అవుతారని సమాచారం. స్టాలిన్​తో భేటీలో తాజా రాజకీయాంశంపై కీలకంగా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంపై దిక్కార స్వరం వినిపిస్తున్న కేసీఆర్.. దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే గత శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం యాసంగిలో బియ్యం సేకరించేది లేదని ప్రకటించడం, వానాకాలంలోనూ లక్ష్యాన్ని స్పష్టంగా వెల్లడించకపోవడం తదితర అంశాలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్​సభ, రాజ్యసభలో నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమావేశాలను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో బియ్యం సేకరణ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ ధోరణిని ఎండగట్టడంతోపాటు పంటలకు మద్దతు ధరలపై విధాన నిర్ణయాన్ని వెల్లడించేలా ఒత్తిడి తెచ్చేందుకు ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్​తో చెన్నైలో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమి పైనా చర్చించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే, మార్చి 28న జరగనున్న యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు ఆహ్వానిస్తారు. గత లోక్​సభ ఎన్నిక ముందు 2010 మే నెల 13న కేసీఆర్ శ్రీరంగం వెళ్లి ఆ తర్వాత అప్పటి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్​తో భేటీ అయ్యారు. అప్పట్లో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)