డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.5,763.2 కోట్ల ఆదాయాన్ని, రూ.992 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో రూ.4,896.7 కోట్ల ఆదాయంపై రూ.762.3 కోట్ల నికర లాభం నమోదైంది. లాభాల్లో 30 శాతం వృద్ధి నమోదైంది. నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు 1.95 శాతం పెరిగి రూ.4,659.20 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.4,917.85 వద్ద గరిష్ఠాన్ని తాకింది. రెండో త్రైమాసిక ఫలితాలపై డాక్టర్ రెడ్డీస్ సహ-ఛైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. తమ కీలక ఉత్పత్తులైన జనరిక్స్, ఏపీఐపై దృష్టి సారిస్తూనే.. దీర్ఘకాల అవసరాలపై పెట్టుబడులూ కొనసాగుతాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ తీరని రోగుల అవసరాలపై తమ పరిశోధనలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే కొవిడ్ను నయం చేసే చికిత్సలు, ఔషధాలపైనా దృష్టి సారించామన్నారు. ఇప్పటి వరకు స్పుత్నిక్-వి వ్యాక్సిన్ సహా, రెమిడెసివిర్, ఏవిగాన్, 2-డీఆక్సీ-డీ-గ్లుకోజ్ వంటి ఔషధాలను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్, మొల్నుపిరవిర్ ఔషధంపై పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు.
లాభంలో 30%వృద్ధి
October 29, 2021
0