ప్రకృతిని సంస్కరించిన గౌతముడు

Telugu Lo Computer
0


మనకు రామాయణం లో రాముడు యొక్క సోదరుడు లక్ష్మణుడిని మోహించి వచ్చిన శూర్పణక ముక్కు చెవులు కోసిన సంగతి అందరికీ తెలిసిందే..శూర్పణక ఆటవిక తెగకు చెందిన స్త్రీ .రావణుడు యొక్క సోదరి.లక్ష్మణుడిపై మనసు పడి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ఆర్య సంస్కృతి ఏం చేసింది? సాటి మహిళ అని కూడా చూడకుండా ముక్కు చెవులు కోయించింది.మరి శ్రమణ సంస్కృతి, ఈ దేశ మూలనివాసీ సంస్కృతిలో అయితే మనిషిని హింసించడం, హత్యలు చేయడం జరగదు. మనిషి లో ఉన్న మోహాన్ని, చెడును పారద్రోలి మనిషి గా మంచి మనిషిగా ఎలా ఎవరికి వారు మారాలో నేర్పే గొప్ప మానవతా విలువలు నేర్పే సంస్కృతి మనది. అలాంటి మూలనివాసీ సంస్కృతిని ఆర్యులు ధ్వంసం చేశారు. గౌతమ బుద్ధుడి కాలంలో నిజంగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రకృతి అనే ఒక యౌవనస్తురాలు ఆనాడు ఆర్యీకరణ వలన ఆమె అంటరాని కులానికి చెందిన స్త్రీ. ఆమెను చండాలికగా ముద్ర వేశారు. ఒకరోజున తథాగత గౌతమ బుద్ధుని ప్రియ శిష్యుడు ఆనందుడు తన ప్రయాణం లో దాహం వేసి దారిలో ఉన్న ఒక నుయ్యి దగ్గరకు చేరుకుంటాడు.అక్కడ ఈ ప్రకృతి అనే యౌవనస్తురాలు చేదతో మంచినీరు తోడుకుంటుంది.ఆనందుడు ఆ అమ్మాయిని తాగడానికి నీళ్ళు ఇవ్వమని అడిగాడు.అంతట ఆ యౌవనస్తురాలు ప్రకృతి శ్రమణా...! నేను అంటరాని కులానికి చెందిన చండాలికను. నా చేతితో నీళ్ళు ఇస్తే మైల పడుతుంది. అని ఆమె అంటుంది. అప్పుడు ఆనందుడు ఆయుష్మతీ..నేను తాగడానికి మంచినీళ్ళు మాత్రమే అడిగాను తల్లీ...నీ కులం అడగలేదు అంటాడు. ప్రకృతి తన కడవలోని నీళ్ళు ఆనందునికి పోసింది. ఆనందుడు దోసిలితో నీళ్ళు తగుతుండగా ఆ క్షణం ప్రకృతి మనసు ఆనందునిపై పడింది. తను జీవితంలో పెళ్ళి అంటూ చేసుకుంటే ఈ శ్రామణుడినే చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వెంటనే వెళ్ళి ఆనందునికి తన మనసులో కలిగిన భావాన్ని వ్యక్తం చేసింది. అందుకు ఆనందుడు సున్నితంగానే తిరస్కరించాడు. తాను బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నాను. తాను శ్రామణుడిని  కాబట్టి నేను నిన్ను పెళ్ళి చేసుకోలేనని చెబుతాడు. అప్పుడు ప్రకృతి నేను నిన్ను మరచిపోలేను అని వాపోతుంది. తిండి తినడం మానేస్తుంది.నెరవేరని కోరికను కలిగి ఉండటంతో ప్రకృతికి నిద్ర పట్టేది కాదు. తన తల్లికి ఈ విషయం తెలిసింది. ప్రకృతి తల్లి ఒకరోజున ఆనందుణ్ణి భిక్షకు ఆహ్వానించి ఎలాగైనా తన తనయ ప్రకృతికి ఆనందునికి పెళ్ళి చేయాలని అనుకుంటుంది. ఆనందుడు భిక్షకు వస్తాడు. ఇంట్లో ప్రకృతిని ,ఆనందుడిని ఉంచి బయట నుంచి తలుపు గడియ వేస్తుంది. ఆనందుడు ఈ విషయం గ్రహించి కిటికీ నుండి బయటకు తప్పించుకుని పారి పోతాడు. చివరకు ప్రకృతి కృంగిపోతూ మనేధతో మంచం పడుతుంది.ఆమె తల్లి చుట్టుప్రక్కల వారి సలహా మేరకు ప్రకృతిని బుద్దుని వద్దకు తీసుకుని వెళుతుంది. బుద్ధుడు ప్రకృతిని పిలిచి నీవు నిజంగా ఆనందుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఆనందునికి ఏమి ఇష్టమో అవి తెలుసుకుని నువ్వు అవి చేయ్ అని చెబుతాడు. ప్రకృతి ఆనందుడి వలె తలవెంట్రుకలు తీసేసుకుని గుండు గీయించుకుంటుంది. కాషాయ వస్త్రాలు ధరిస్తుంది. ఒకపూటే భోజనం చేస్తూ కటిక నేలమీద పడుకుంటుంది. ఇలా చేయగా చేయగా తనలో ఉన్న మోహం క్రమంగా తగ్గి బుద్ధ ధర్మం వైపు ఆసక్తి కలిగింది. బుద్ధుని బోధనలు విన్నది, విపశ్యనా ధ్యానం చేసింది. ప్రకృతి లో ఇక విశ్వమానవ ప్రేమ భావన కలిగింది. ఆనందునిపై ప్రేమ క్రమంగా పరుల కొరకు పాటు పడాలి అనే భావన వైపు మళ్ళింది. బుద్ధుని శరణుజొచ్చి తనకు దీక్ష ఇవ్వమని వేడుకుంది. బుద్ధుడు ఆమెకు దీక్ష ఇచ్చాడు.ఈ విధంగా మోహించి వచ్చిన ప్రకృతి లో బుద్ధుడు మానసిక పరివర్తన తెచ్చాడు. ప్రకృతి ప్రేమను సమాజం కోసం సేవ చేయాలనే వైపు మళ్ళించాడు. ప్రకృతికి చాలా గొప్పనైన స్థానాన్ని ఇచ్చి స్త్రీలను గౌరవించిన గొప్ప వ్యక్తి బుద్ధుడు.బుద్దుడు స్త్రీ స్వేచ్ఛను కోరుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)