భావ శుద్ధి !

Telugu Lo Computer
0



పూజకు ఉపయోగించే ద్రవ్యాలు శుభ్రంగా ఉండాలనుకోవడం సహజమే. కస్తూరి, పునుగు వంటి సుగంధ ద్రవ్యాల్ని జంతువుల నుంచి సేకరిస్తారు. ఆవుపాలను లేగదూడ, తేనెను తేనెటీగలు ఎంగిలి చేస్తాయి. అటువంటి బాహ్య సామగ్రికి సంబంధించిన శుచికైనా, శుద్ధతకైనా ఒక కొలమానం లేదు. స్వామికి శుచిగా అర్పించదగినది మనసు ఒకటే! మనసు, బుద్ధి, చిత్‌, అహంకారంతో కూడినది- అంతఃకరణ. దీన్ని శుద్ధి చేయాలంటే, సంస్కరించాలి. మానవ దేహం అన్నింటి సమాహారం. ఇందులో పరమాత్మ ఉన్నాడని అతడు గ్రహించి వ్యవహరించాలి. పవిత్రత ఉండటం, లేకపోవడం అనేవి కేవలం మనోభావాలు. దోషపూరితమైనవాటినీ దోష రహితంగా చూసేది మనసే. దైవానికి అర్పించే పదార్థాల పరిధిని గుర్తించాల్సింది, వాటి యథార్థ తత్వాన్ని ఆకళింపు చేసుకోవాల్సింది భక్తహృదయమే! సకల చరాచర సృష్టి- పంచభూతాత్మక మయం. దీనికి చిహ్నంగా భగవంతుడికి చేసే అర్చన పంచోపచార పూజ. భక్తుడు పృథ్వీతత్వంతో గంధాన్ని, వాయుతత్వంతో ధూపాన్ని, అగ్నితత్వంతో దీపాన్ని సమర్పిస్తాడు. అలాగే జలతత్వంతో అర్ఘ్యం, ఆకాశతత్వంతో పుష్పం స్వామికి అర్పిస్తాడు. దైవంలో లేనిది, దైవం కానిది ఏదీ లేదు. పరమాత్మ పరిపూర్ణుడు. ఆయన సర్వజ్ఞత్వం, స్వతంత్రత, అనంతశక్తి తత్వాలతో భాసిల్లుతుంటాడు. ఆ మహాపూర్ణ స్వరూపానికి సమర్పించడానికి మనిషి వద్ద ఏదీ లేదు. చేతులు జోడించి శరణాగతి వేడటమే ఏకైక మార్గం. వస్తు దోషం, కర్మలోపం లేని కార్యం ఏదీ ఉండదు. విధి నిర్వహణలో లోపాలు దొర్లడమూ సహజం. సాక్షాత్‌ చతుర్ముఖ బ్రహ్మయజ్ఞం చేసినా, ఏవో కొన్ని కర్మ లోపాలు తప్పవు. యజ్ఞయాగాదుల్లో చోటుచేసుకునే లోపాలకు ప్రాయశ్చిత్త హోమాలు ఉన్నాయి. వాటిలోనూ దొర్లే చిన్నపాటి తప్పిదాలకు క్షమాపణ అర్థిస్తారు భక్తులు. ఈశ్వరారాధనలో వస్తువు పవిత్రత కన్నా పావనమైన భావనే మిన్న. శ్రద్ధగా కర్మల్ని ఆచరించాలి. బుద్ధిని వికసింపజేసి, సారాన్ని గ్రహించాలి. విగ్రహారాధన వల్ల నిగ్రహం కలుగుతుంది. భక్తి, శ్రద్ధ, ప్రపత్తులు దీని ఫలాలు. వీటితో భావశుద్ధికి బీజం పడుతుంది. ఆరాధన మార్గంలో తాత్విక దృష్టి, తార్కి కత, శాస్త్రీయ దృక్పథం ఇమిడి ఉన్నాయి.       ‘నా ముఖాన్ని అవలోకించేందుకు అద్దం ఉపాధి (ఆధారం).        నన్ను నేను తెలుసుకునేందుకు దైవం ఉపాధి’ అనే సత్యాన్ని భక్తుడు అవగతం చేసుకోవాలి. ‘నాలోని పరమాత్మను నేను గుర్తించాలంటే, అందరిలోనూ ఆయనను దర్శించడాన్ని ముందుగా అలవరచుకోవాలి’ అని గ్రహించి మసలాలి. ఎదుటివారి లోపాల్ని ఎంచకుండా వారిని సంస్కరించడానికే ప్రయత్నించాలి. ద్వేషాన్ని ప్రేమతో జయించాలి. భావ శుద్ధి ఉంటే, భావ సిద్ధి లభిస్తుంది. ఏ భావనతో అర్చిస్తే, పరమాత్మ ఆ భావననే సిద్ధింపజేస్తాడు. ఏ రూపంలో భావిస్తే, ఆ రూపంలోనే స్వామి దర్శనమిస్తాడు. ఒక భక్తుడు ఆధ్యాత్మిక దృష్టితో విష్ణు సాన్నిధ్యం కోరాడు. ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో మహాయజ్ఞాన్ని సంకల్పించాడు. సంబారాలు సమకూర్చాడు. ఋత్విజులకు ఆహ్వానం పలికాడు. అంతలోనే అకాల మరణం పొందాడు. యజ్ఞసంకల్పం నెరవేరలేదన్న బాధ అతడిది. అయినప్పటికీ, ఆ భక్తుడికి విష్ణుపదం ఆహ్వానం పలికిందని పురాణ కథనం. ‘నువ్వు తలపెట్టిన కార్యంతో పని లేదు, నీలో వెల్లివిరిసిన భావనే ప్రధానం’ అనేది అందులోని అంతరార్థం.

Post a Comment

0Comments

Post a Comment (0)