ఆగస్ట్ 15న మహారాష్ట్ర ముఖ్యమంత్రి జెండావందనం చేసిన సందర్భంగా ప్రసంగించారు. ఆ ప్రసంగ సమయంలో ఆయన స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందని తన వెంట ఉన్న సహాయకుడిని అడిగారని, ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో కూడా తెలియని ఠాక్రెను చెంప దెబ్బకొట్టాలని నారాయణ రాణె అన్నారన్నది ఆరోపణ.సోమవారం జరిగిన ఒక సభలో మాట్లాడిన రాణె... ''ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో కూడా తెలియదు. నేనే కనుక అక్కడుంటే చెంప పగులగొట్టేవాడిని'' అన్నారు.
"స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చిందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటు. తన ప్రసంగ సమయంలో ఆయన తన వెనుకనున్నవారిని అడిగారు'' అన్నారు రాణె. బీజేపీకి చెందిన నారాయణ రాణె అరెస్టుతో మహారాష్ట్రలోని పాలక శివసేన, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలో ఉద్రిక్తతలు రగల్చడానికే కేంద్ర మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేశారని శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిగా ఉన్న నారాయణ రాణె 2005 వరకు శివసేనలోనే ఉండేవారు. ఆ తరువాత శివసేనను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అనంతరం బీజేపీలో చేరారు.