ఎమ్మెస్ రామారావు

Telugu Lo Computer
0


ఎమ్మెస్ రామారావు పూర్తిపేరు మోపర్తి సీతారామారావు. ఈయనకు సుందర దాసు అనే బిరుదు ఉంది. ఈయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటిసారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించారు. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన రామయణ భాగం సుందరకాండము ఎమ్మెస్ రామారావు సుందరకాండగా సుప్రసిద్ధం. తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు. ఈ రెండూ ఈయనకు మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

ఎమ్మెస్ రామారావు 1921 మార్చి 7 న గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య, మంగమ్మ  సీతారామ భక్తులు. చిన్నతనం నుండే రామారావు  పాటలు పాడుతుండేవారు. ఈయన విద్యాభ్యాసము నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో, గుంటూరు హిందూ కళాశాలలో జరిగింది. రామారావు గారికి 1942 లో లక్ష్మీ సామ్రాజ్యంతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె (వెంకట సరోజిని), ఇద్దరు కుమారులు (బాబూరావు, నాగేశ్వరరావు)

ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో (1941 లో) అంతర్ కళాశాలల లలిత సంగీత పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు. న్యాయనిర్ణేతల్లో ఒకరైన అడవి బాపిరాజు చలన చిత్ర రంగంలో ప్రవేశించమని ఆయనను చాలా ప్రోత్సహించారు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటిసారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించారు. ఆ చిత్రంలో నాయక పాత్ర ధరించిన సి.హెచ్. నారాయణరావుకు ఇది గాత్రదానం. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం. తరువాత ఈయన దీక్ష, ద్రోహి, మొదటిరాత్రి, పాండురంగ మహత్యం, నా యిల్లు, సీతారామ కల్యాణము, శ్రీరామాంజనేయ యుద్ధము మొదలైన సినిమాలలో పాడారు. 1944 నుంచి 64 వరకు తెలుగు చలన చిత్రాలలో నేపథ్య గాయకునిగా మద్రాసులో నివసించిన ఆయన ఐదు సంవత్సరాల పాటు కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. కొన్ని పాటలు రాసి నల్లపిల్ల, తాజ్ మహల్, హంపి, కనీసం, హిమాలయాలకు రాలేనయ్యా, మొదలైన గ్రామఫోన్ రికార్డులు ఇచ్చారు. నీరాజనం చిత్రంలో "ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా" పాటలో ఎమ్మెస్ గొంతు వినిపించింది.

1963 సంవత్సరాంతంలో కొన్ని కారణాల వల్ల మద్రాసు వదిలి రాజమండ్రి చేరుకుని 1974వరకు అక్కడే నివసించారు. అక్కడ నవభారతి గురుకులంలో పది సంవత్సరాలు ఉద్యోగం చేసారు. 1970 లో పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేన ఇండియన్ ఏర్ ఫోర్స్(IAF)లో పైలట్ ఆఫీసరుగా నియమితుడైనారు. 1971లో పాకిస్థానుతో జరిగిన యుద్ధ కాలంలో అతని ఆచూకీ తెలియ లేదు. తల్లి తండ్రులిద్దరూ భయం చెంది కుమారుని క్షేమం కోసం వాయు కుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలు పెట్టారు. తర్వాత కొంత కాలానికి అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమానుడే వారి ఇష్ట దైవమైనాడు. ఆయన హనుమాన్ చాలీసా, సుందరకాండ వ్రాయడానికి అదే ప్రేరణ. 1972 నుండి 74 వరకు తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోనికి అనువదించారు, తన పేరుతో అవినాభావ సంబంధమేర్పడ్డ సుందరకాండ గేయరచన చేశారు. 1975 నుంచి హైదరాబాదులోని చిక్కడపల్లిలో నివసించారు. రామారావుకు 1977 సంవత్సరంలో సుందరదాసు అనే బిరుదాన్ని ఇచ్చారు. ఈయన ఏప్రిల్ 20, 1992న హైదరాబాదులో సహజ మరణం పొందారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)