ఝల్కారీబాయి

Telugu Lo Computer
0

 

1838 బుందేల్ ఖండ్ లోని అటవీ ప్రాంతం ..ఎనిమిదేండ్ల అమ్మాయి పశువులను మేపేందుకు అడవిలోనికి వెళ్ళింది. ఎప్పటి లాగా పశువులను మేతకు తోలి వెంటతెచ్చుకున్న రోటీల మూటను చెట్టుక్రింద పెట్టి నీడన కూర్చొంది. ఉన్నట్లుండి పొదలమాటన నక్కివున్న "చిరుతపులి" ఆవు మీదకు దాడిచేసింది. ఆవు అరుపులు విన్న ఆ అమ్మాయి వెంటనే కర్ర తీసుకొని ఆవువైపు పరిగెత్తింది. కర్రను కత్తిలా తిప్పుతూ చిరుతపై దాడికి దిగింది. ఆవును వదిలిన చిరుత ఆ బాలికపై దాడికి దిగి తన పదునైన పంజాలను ఆ అమ్మాయిపైకి విసరసాగింది. ఆ పంజా దెబ్బలను ఒడుపుగా తప్పించుకుంటూ కర్రతో చిరుత తలపై దాడిచేస్తుంది ఆ అమ్మాయి. ఈ అరుపులు విని పరిగెత్తుకు వచ్చిన కొంతమంది పశుకాపరులు జరుగుతున్న పోరాటాన్ని చూసి నిశ్చేష్టులై నిలబడి పోరాటాన్ని చూడసాగారు, చిరుత నాలుగు అడుగులు వెనక్కి వేసి వున్నట్లుండి గాలిలోనికి లేచి ఆమె మీదకు దూకింది. అత్యంత చాకచక్యంగా తప్పుకుంటూ ఆ బాలిక తన మొనదేలిన చేతికర్ర బాగాన్ని ఆ చిరుత కంఠం లోనికి అది గాలిలో వుండగానే దింపింది. అంతే అంత పెద్దచిరుత  గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలొదిలింది. అప్పటిదాకా కళ్పప్పగించి ఆత్రుతగా పోరాటాన్ని చూస్తున్న పశువుల కాపరులు చప్పట్లుకొడుతూ గ్రామానికి వెళ్ళి ఆమె పోరాటాన్ని గొప్పగొప్పగా చెప్పసాగారు. ఆమె ధైర్య సాహసాలు ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోయింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా. బుందేల్ ఖండ్ లో ఈ రోజుకీ జానపదగీతాలలో పాడుకోనే వీరనారి ఝల్కారీభాయ్ . 1857 జాతీయోద్యమంలో ఝాన్సీరాణి కుడిభుజం. ఝల్కారీ భాయ్ 1830 నవంబరులో ఒక పేద దళితకుటుంబంలో సదోవర్ సింగ్, జమునాదేవి దంపతులకు జన్మించింది.అయితే చిన్నతనంలోనే తల్లి జమునాదేవి మరణించడం వలన తండ్రి పెంపకంలో పెరిగింది. సదోవర్ సింగ్ ఆమెకు గుర్రపుస్వారీ, కత్తిసాము నేర్పించాడు..  ఆమె ధైర్యసాహసాలు విన్న  ఝాన్సీలక్ష్మిభాయ్ ఆమెను కోటకు ఆహ్వానించి ఝాన్నీ సైన్యములోని మహిళా విభాగమైన "దుర్గావాహినికి" నాయకురాలిగా చేసింది. ఝల్కారీభాయ్ ఝాన్నీ సైన్యనాయకులలో ఒకడైన పూరణ్ సింగును వివాహమాడింది.1857 లో జరిగిన జాతీయోధ్యమంలో ఈమె కూడా పాల్గొంది..1858 ఏప్రెల్ 3 వతేదిన బ్రిటీష్ సైనికజనరల్ హాగ్ రోజ్ ఝాన్సీ కోటను ముట్టడించాడు..ఝాన్సీరాణి ఆ ముట్టడి నుండి తప్పించుకొని విప్లవకారులను చేరేందుకు ఝల్కారీ భాయ్ ఝాన్సీరాణిలా వేషం వేసుకొని హగ్ రోజ్ సేనల దృష్టిని మళ్ళించింది. అత్యంతధైర్యసాహసాలతో హగ్ రోజ్ సైన్యాలను ముప్పతిప్పలు పెట్టింది. ఆమెను పట్టుకునేందుకు వారు ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఎట్టికేలకు ఆమెను బంధించగలిగేరు.. ఆమె  ఝాన్సీరాణి కాదని తెలుసుకున్న ఆంగ్లేయులు ఆమె ధైర్యసాహసాలకు,తెలివికి ఆశ్చర్యపోయారు. అయితే ఆంగ్లేయులకు చిక్కిన తర్వాత ఆమె ఏమైంది అనేది మిష్టరీగా మిగిలిపోయింది..ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో ఒక బహుజన వీరపుత్రి పాత్ర మరుగున పడిపోయింది...ఇప్పటికీ బుందేల్ ఖండ్ ప్రాంతంలో ఝాన్సీరాణితో సమానంగా ఝల్కారీభాయ్ ను గౌరవిస్తారు. ఆమె వీరగాథలను జానపద బాణీలలో పాడుకుంటూవుంటారు!

Post a Comment

0Comments

Post a Comment (0)