టీకా తర్వాత జ్వరం ఎందుకు వస్తుంది ?

Telugu Lo Computer
0


కోవిడ్‌ టీకా తీసుకున్న తర్వాత చాలా మందిలో జ్వరం రావడం, అలాగే తీవ్రమైన తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ వేసుకుంటే కరోనా వస్తుందేమోనన్న అపోహా చాలా మందిలో ఉంది. అయితే, టీకా తర్వాత అలాంటి లక్షణాలు చాలా సాధారణమని, శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పునరుత్తేజమవుతుందని చెప్పడానికి అవే సంకేతాలని వైద్యులు చెబుతున్నారు. టీకా వేసుకున్న తర్వాత శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయని  వైద్య నిపుణులు అంటున్నారు.  రోగ నిరోధక వ్యవస్థలో రెండు ప్రధాన భాగాలుంటాయి. ఒకటి సహజ వ్యవస్థ. రెండోది సముపార్జిత వ్యవస్థ. మన ఒంట్లోకి ఏదైనా ప్రవేశించిందని శరీరం గుర్తించిన వెంటనే ఈ సహజ వ్యవస్థ స్పందించి ప్రతి చర్య ప్రారంభిస్తుంది. అలా మనం కరోనా టీకా వేసుకోగానే తెల్ల రక్తకణాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని ప్రక్రియ ప్రారంభిస్తాయి. దాని వల్లే టీకా వేసుకున్న భాగంలో తిమ్మిర్లు, నొప్పిగా అనిపించడం, అలసటగా ఉండటం లాంటి లక్షణాలు కన్పిస్తాయి.

ఇక రోగ నిరోధక వ్యవస్థలో ఈ రాపిడ్‌ రెస్పాన్స్‌ ప్రక్రియ వయసును బట్టి క్షీణిస్తుంది. యువతలో అయితే ఈ ప్రతిస్పందన ఎక్కువగా ఉంటే.. వృద్ధుల్లో తక్కువగా ఉంటుంది. అందుకే వృద్ధుల కంటే యువతలోనే టీకా తీసుకున్న తర్వాత జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. శరీరాన్ని బట్టి టీకా తీసుకున్న వారిలొ ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణాలు కనిపిస్తుంటాయంటున్నారు.

రెండో డోసు టీకా తీసుకున్న వారి కొందరిలో జ్వరం, తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు పెద్దగా ఉండకపోవచ్చు. ఇలాంటి లక్షణాలు లేకపోతే వ్యాక్సిన్‌ పని చేయకపోవడం కాదని  వైద్య నిపుణులు అంటున్నారు. ఇక రెండో విషయానికొస్తే.. టీకాలు మన రోగ నిరోధక వ్యవస్థలోని రెండో ప్రధాన భాగమైన సముపార్జిత వ్యవస్థను చైతన్యవంతం చేస్తాయి. టి, బి కణాలు, యాంటీబాడీలు ఇందులోని భాగమే. అసలైన ప్రక్రియ అప్పుడే ప్రారంభం అవుతుంది. దీని వల్ల శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవే వైరస్‌ నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)