సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల శివారులో మాంసం కోసం నలుగురు వ్యక్తులు కిరాతకంగా ప్రవర్తించారు. బతికున్న రెండు గేదెల తొడలను పదునైన కత్తులతో కోసి వండుకొని తినే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న గేదెల యజమాని వాటిని ఆస్థితిలో చూసి గుండెలవిసేలా విలపించారు.
సిరిసినగండ్ల-దమ్మకపల్లి గ్రామాల మధ్య రాజేందర్రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో నేపాల్కు చెందిన ఒకరు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు యువకులు పని చేస్తున్నారు. రాజగిరి వెంకటేశం అనే రైతు శుక్రవారం రాత్రి పొలంలోని పాకలో ఉన్న తన గేదెల నుంచి పాలు పిండుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అనంతరం రాత్రి వేళ నలుగురు యువకులు కలిసి మాంసం కోసం పదునైన కత్తులతో రెండు గేదెల తొడ భాగాలను కోసేయడంతో అవి తీవ్ర రక్తస్రావమై మరణించాయి.
శనివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు వాటిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. అసలైమైందో కొంత సమయం వరకు అతడికి అర్థం కాలేదు. దగ్గరకు వెళ్లి చూడగా రెండు గేదెల తొడలు మొత్తం కోసినట్లు కనిపించింది. అతడు గ్రామస్తులకు సమాచారం చేరవేశాడు. చుట్టుపక్కల వెతికాడు. ఈ పని ఎవరు చేసి ఉంటారా అని ఆరా తీశాడు. చివరకు గ్రామస్థులతో కలిసి చుట్టుపక్కల గాలించగా వ్యవసాయక్షేత్రంలో నిందితులు కనిపించారు. గేదె మాంసాన్ని వండుకునేందుకు సిద్ధం చేసుకుంటుండగా పట్టుకున్నారు. గ్రామస్తులను చూసి ముగ్గురు నిందితులు అక్కడ నుంచి పారిపోగా నేపాలీ యువకుడు సందీప్ (25) మాత్రం పట్టుపడ్డాడు.
గ్రామస్థులు సిద్దిపేట పోలీసులకు సమాచారమివ్వగా సిద్దిపేట 3 టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు. పరారీలో ఉన్న ఆ ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.