కోవిషీల్డ్ గ్యాప్ వివాదం : కేంద్రం స్పష్టత

Telugu Lo Computer
0


కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ బుధవారం కీలక ప్రకటన చేశారు. తొలి డోస్‌కు రెండవ డోసుకు మధ్య వ్యవధి పెంచడంపై గందరగోళం నెలకొనడంతో ఆయన వివరణ ఇచ్చారు. తొలుత కోవిషీల్డ్‌ తొలి డోసు తీసుకున్నాకా 6-8 వారాల లోపు రెండవ డోసు తీసుకోవాలని కేంద్రం తెలిపింది. అనంతరం దీనిని 12-16 వారాల వరకు పెంచింది. అయితే దీనిపై ప్రజలు, ఆసుపత్రులు,  ఆరోగ్య సిబ్బందిలో గందరగోళానికి కారణమైంది. ఈ పరిణామాల మధ్య హర్షవర్థన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

కొవిషీల్డ్‌ డోసుల వ్యవధి పెంపుపై శాస్త్రీయ డేటా ఆధారంగా చాలా పారదర్శకంగా నిర్ణయం తీసుకున్నాం. శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించడానికి భారత్‌కు చాలా పటిష్ఠమైన వ్యవస్థ ఉంది. ఇలాంటి ముఖ్యమైన విషయాలను  రాజకీయం చేయడం దురదృష్టకరం’’ అని హర్షవర్ధన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

కొవిషీల్డ్‌ డోసుల వ్యవధిని 8-12 వారాలకు మాత్రమే పెంచాలని తాము సిఫార్సు చేశామని, కానీ 12-16 వారాలకు  పెంచుతూ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందని నేషనల్‌ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌(ఎన్‌టీఏజీఐ) సభ్యులు కొందరు చెప్పినట్లు కొన్ని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ల కొరత కారణంగానే కొవిషీల్డ్‌ డోసుల వ్యవధిని పెంచినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హర్షవర్థన్ స్పష్టతనిచ్చారు.

ఎన్‌టీఏజీఐ ఛైర్మన్‌ డా.ఎన్‌కే అరోరా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. డోసుల మధ్య వ్యవధి పెంపు అనేది పూర్తిగా శాస్త్రీయత ఆధారంగా తీసుకున్న నిర్ణయమేనని స్పష్టం చేశారు. దీనిపై ఎన్‌టీఏజీఐ సభ్యుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవంటూ మీడియా కథనాలను తోసిపుచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)