రాష్ట్రవ్యాప్తంగా మూడుచోట్ల చిన్నారులకు కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. విశాఖ, తిరుపతి పాటు విజయవాడ-గుంటూరుల్లో ఒకచోట ఏర్పాటు చేయాలనీ సూచించారు.
కరోనా థర్డ్వేవ్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకోకముందే ధర్డ్వేవ్ ముప్పు వెంటాడుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో 8 వేల చిన్నారులకు, ఏపీలోని చిత్తూరు, కడప జిల్లాల్లో చిన్నారులకు కరోనా సోకడంతో ఆందోళన పెరుగుతోంది. థర్డ్వేవ్ ప్రారంభమైందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు చేస్తోంది. థర్డ్వేవ్ ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా వైరస్ నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గర్భిణీలు, చిన్నారుల కోవిడ్ చికిత్సపై వైఎస్ జగన్ దృష్టి సారించారు.యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో పీడియాట్రిక్ వార్డుల అభివృద్ధి, మెడికల్ కళాశాలల్లో వార్డుల అభివృద్ధికి ఆదేశించారు. వార్డుల అభివృద్ధికి ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని సూచించారు.అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. దాదాపు 180 కోట్ల ఖర్చుతో ఒక్కొక్క ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.