కేరళకు చెందిన 74 ఏళ్ల ఒమనా చెట్టన్ గతంలో మావటిగా పనిచేసేవాడు. ఒమనా చెట్టన్ వద్దే బ్రహ్మదాథన్ ఏనుగు ఉండేది. అప్పట్లో అతను ఈ ఏనుగును ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మావటి ఇటీవలే కన్నుమూశాడు. విషయం తెలిసిన గజరాజు పరుగు పరుగున మావటి ఇంటికి చేరుకుంది. అప్పటికే అక్కడ చుట్టాలు, బంధు వులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. మృతదేహం చుట్టూ నిలబడి ఏడుస్తున్నారు. ఆ ఏనుగు కూడా మావటి మృతదేహన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడిపోయింది. కాగా, మావటి పట్ల ఈ మూగజీవికి ఉన్న ప్రేమను చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
కరోనా కాలంలో మనిషి మాయమైపోతున్నాడు. మనుషుల్లో మానవత్వం కనిపించకుండాపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయినవారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా కుటుంబ సభ్యులు ముందుకు రావటంలేదు. కానీ, ఇక్కడో నోరులేని మూగజీవి మాత్రం.. తన మావటి కోసం ఏకంగా 20 కిలోమీటర్ల దూరం నుండి చివరి చూపు చూసేందుకు వచ్చింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆప్రాంతమంతా దుఃఖసాగరంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి..నెటిజన్లను సైతం కంటతడి పెట్టిస్తోంది.