కరోనా నుండి వ్యాక్సిన్లు 100 శాతం రక్షణ కల్పించలేవని, తీవ్రతను తగ్గిస్తాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. అందుకే టీకా వేసుకున్నా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని అన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు యాంటీబాడీ టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తొలి డోసు ఒక సంస్థది, రెండో డోసు ఇంకో సంస్థది తీసుకున్నా ఆందోళనపడాల్సిన పని లేదన్నారు. ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల 20 మంది లబ్ధిదారులకు రెండు వేర్వేరు సంస్థలకు చెందిన డోసులిచ్చిన విషయం గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘వేర్వేరు కంపెనీల డోసులు తీసుకున్నా ప్రతికూల ప్రభావాలేమీ ఉండవు. అయితే దీనిపై శాస్త్రీయంగా బలమైన అభిప్రాయానికి రావడానికి మరిన్ని అధ్యయనాలు, ఆధారాలు రావాల్సి ఉంది. ఒకవేళ ఇప్పటికే ఇలా జరిగిపోయినప్పటికీ ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ప్రస్తుత ప్రొటోకాల్స్ ప్రకారం రెండు డోసులూ ఒకే సంస్థవి ఇవ్వాలి. వైద్యసిబ్బంది వాటిని కచ్చితంగా పాటించాలి’’ అన్నారు.
కొందరు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా యాంటీబాడీలు ఏమీ ఉత్పత్తి కావడం లేదంటున్నారన్న ప్రశ్నకు వీకేపాల్ బదులిస్తూ ‘‘వ్యాక్సిన్ తీసుకున్నవారు యాంటీబాడీ పరీక్షలు చేయించుకోనక్కర్లేదు. రోగనిరోధశక్తి కొలవడానికి యాంటీబాడీ టెస్ట్ ఒక కొలమానం మాత్రమే. అదే ఏకైక కొలమానం కాదు.