తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు

Telugu Lo Computer
0


క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు మల్కాజ్‌గిరి కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. తీన్మార్ మల్లన్నతోపాటు మరో నలుగురికి కూడా బెయిల్ మంజూరైంది. ఒక్కొక్కరికి రూ. 20 వేలు పూచీకత్తు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వీరికి రెండు కేసుల్లో రెగ్యూలర్ బెయిల్ కోర్టు ఇచ్చింది. ఇంతకుముందు తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై తుది తీర్పును మల్కాజ్ గిరి కోర్టు నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. రెండో కేసు బెయిల్ పిటిషన్ పై పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించిన మల్లన్న లాయర్.. అదే రోజు అంటే ఏప్రిల్ 12న ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఏప్రిల్ 13న ఒక్కరోజే వర్కింగ్ డే అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలో తీర్పును నేటికి వాయిదా వేసింది. సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీన్మార్ మల్లన్న మంగళవారం జైలు నుంచి విడుదల కానున్నారు. మార్చి నెలలో అరెస్ట్ అయిన మల్లన్న 28 రోజులపాటు చర్లపల్లి జైలులో ఉన్నారు.ఏప్రిల్ 11న తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టగా.. నాన్ బెయిలబుల్ సెక్షన్ అసలు మల్లన్నపై వర్తించదని మల్లన్న తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్ అడ్డుకోవడానికి పాత వారెంట్స్ తెర మీదకు తెస్తున్నారని ఆరోపించారు. సాంకేతిక కారణాలు చూపించి బెయిల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మల్లన్న న్యాయవాది వాదించారు. కాగా, తీన్మార్‌ మల్లన్నపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 90 కేసులు నమోదయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)