మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో శ్రీ వసంతరావు నాయక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఓ రోగి ఇద్దరు వైద్యులపై కత్తితో దాడి చేశాడు. నిందితుడు రోగి ఒక వైద్యుడిని కడుపులో పొడిచాడు. అతన్ని రక్షించడానికి వచ్చిన ఇతర వైద్యుడిపై కూడా దాడి చేశాడు. వైద్యులు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పండ్లు కోసే కత్తితో నిందితుడు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఈ రోగి బుధవారం ఉదయం ఆస్పత్రిలోని సర్జరీ విభాగంలో చేరినట్లు యావత్మాల్ ఎస్పీ పవన్ బన్సోద్ తెలిపారు. ఆసుపత్రికి చెందిన ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లు రాత్రి తొమ్మిది గంటల సమయంలో రౌండ్స్పైకి వచ్చినప్పుడు, రోగి ఆపిల్ తినవచ్చా అని డాక్టర్ ని అడిగాడు. అయితే అతడిని పరీక్షించిన డాక్టర్ యాపిల్ తినడానికి నిరాకరించారు. దీంతో నిందితుడికి కోపం వచ్చింది. ఆ తర్వాత యాపిల్ను కోసేందుకు ఉపయోగించిన కత్తితోనే నిందితుడు డాక్టర్పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని చూసి రక్షించడానికి వచ్చిన తోటి డాక్టర్లపై కూడా నిందితుడు దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి ఇద్దరి వైద్యుల వాంగ్మూలాలు నమోదు చేసి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ పవన్ బన్సోద్ తెలిపారు. నిందితుడు చికిత్స పొందుతున్నాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కస్టడీలో తదుపరి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
వైద్యులపై రోగి కత్తితో దాడి !
January 06, 2023
0
Tags