మొదటి వన్డేలో న్యూజిలాండ్‌ విజయం

Telugu Lo Computer
0


న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. కివీస్‌ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. బ్యాటర్లు రాణించినప్పటికీ బౌలర్లు విఫలం కావడంతో భారత జట్టుకు పరాజయం తప్పలేదు. ఈ విజయంతో న్యూజిలాండ్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, శుబ్‌మన్‌ గిల్‌ వరుసగా 72, 50 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 80 రన్స్‌ సాధించాడు. వీరికి తోడు సంజూ శాంసన్‌ 36, వాషింగ్టన్‌ సుందర్‌ 37 పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఫిన్‌ అలెన్‌ 22, డెవాన్‌ కాన్వే 24 పరుగులకే అవుటయ్యారు. అయితే, ఫస్ట్‌డైన్‌లో వచ్చిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ టామ్‌ లాథమ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు. విలియమ్సన్‌ 98 బంతుల్లో 94 పరుగులు చేయగా, టామ్‌ లాథమ్‌ 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 145 పరుగులతో అజేయంగా నిలిచాడు. కివీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇక భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌కు ఒకటి, ఉమ్రాన్‌ మాలిక్‌కు రెండు వికెట్లు దక్కాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)