తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. శనివారం సరాసరి లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు టీబీ బోర్డు అధికార వర్గాలు పేర్కొన్నాయి. నీటి ఉధృతిని బట్టి డ్యాం గేట్లు ఎత్తి నదికి ఏ క్షణంలోనైనా నీటిని విడుదల చేస్తామని డ్యాం అధికారులు ప్రకటించారు. నది వైపు ఎవరూ వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. నది పరివాహకంలో ఉండే రైతులు, గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. డ్యాం నీటి సామర్థం 105.788 టీఎంసీలు కాగా శనివారం ఉదయం అధికారుల నీటి లెక్కల ప్రకారం 72.951 టీఎంసీలు చేరాయి. ఇన్ఫ్లో 95,484 క్యూసెక్కులుగా నమోదయింది. జలాశయం పై ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద నీరు డ్యాంకు మరింత పెరిగే అవకాశం ఉంటుందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది ఇదే నాటికి 35.533 టీఎంసీల నీరు చేరాయి.
తుంగభద్రకు వరద
July 10, 2022
0