భగ్గుమన్న అన్నాడీఎంకేలో వర్గపోరు !

Telugu Lo Computer
0


తమిళనాడులో అన్నాడీఎంకేలో వర్గపోరు మరోసారి భగ్గుమంది.  పళని, పన్నీరు వర్గాలు  రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఓవైపు హైకోర్టు తీర్పు, మరోవైపు కార్యవర్గ సమావేశంతో చెన్నైలో హీట్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. పార్టీపై పెత్తనం కోసం పళని, పన్నీరు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో అధికారం ఒకరి చేతుల్లోనే ఉండాలని పళనిస్వామి చెబుతుండగా.. ఆయన విధానాలను పన్నీరుసెల్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలోనే జరిగిన కార్యవర్గసమావేశంలోనూ కుమ్ములాట జరిగింది. శశికళ దయతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన పళనిస్వామి.. ఢిల్లీ పెద్దల అండతో పార్టీపైనా పట్టు సాధించారు. ఓపీఎస్ను పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు డిప్యూటీ సీఎం పదవి సైతం కట్టబెట్టారు. ఆ తర్వాత పార్టీ సమన్వయకర్తగా ఓపీఎస్‌, ఉపసమన్వయకర్తగా ఈపీఎస్కు పదవుల పందేరం జరిగింది. అయితే పళనిస్వామి ముఖ్యమంత్రి పదవిలో ఉండడంతో ఆయన మాటే చెల్లుబాటయింది. దీంతో మరొకరితో కలిసి పగ్గాలు పంచుకునేందుకు ఆయన ఒప్పుకోవట్లేదు. పార్టీలో క్రియాశీలకమైన 60 మంది జిల్లా కార్యదర్శుల్లో ఎక్కువమంది ఈపీఎస్‌ వెంటే ఉండడంతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 66 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలినవారంతా ఈపీఎస్‌ వెంట వుండడం కూడా ఆయనకు ధైర్యాన్నిచ్చింది. దీనికి తోడు పన్నీర్‌సెల్వం శశికళతో సన్నిహితంగా ఉండడంతో పాటు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో తనను సాగనంపేందుకు కుట్ర జరుగుతోందన్న నిర్ణయానికి వచ్చిన ఈపీఎస్‌.. ఏకనాయకత్వం అంశాన్ని తెరపైకి తెచ్చారు. మరోవైపు అన్నాడీఎంకేపై పన్నీర్‌ సెల్వం పూర్తిగా పట్టు కోల్పోతున్నారు. తన అనుకున్న నేతలంతా ఆయనకు దూరమయ్యారు. పార్టీలో కీలకమైన జిల్లా కార్యదర్శుల్లో 90శాతం ఈపీఎస్‌ వైపు చేరడంతో వాళ్లు చెప్పింది వినడం మినహా ఓపీఎస్కు మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)