విద్యుత్ టారిఫ్ కేటగిరీల్లో మార్పులు చేయడం ద్వారా గృహ విద్యుత్ వినియోగదారులపై రూ.919.18 కోట్ల భారాన్ని విద్యుత్ సంస్థలు మోపాలని ప్రతిపాదించాయి. ఇవి అమలైతే గరిష్ఠంగా 200లోపు యూనిట్ల విద్యుత్తును వాడుకునే మధ్యతరగతి వినియోగదారులపైనే ఎక్కువగా ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వం రాయితీలు పెంచకపోతే వీరు నెలకి రూ.280 వరకూ అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ ఛార్జీలు పెంచనున్నట్లు ఎక్కడా ప్రస్తావించకుండా హేతుబద్ధీకరణ పేరుతో కేటగిరీలను తగ్గించడం ద్వారా యూనిట్ విద్యుత్ సరఫరాకు అయ్యే వాస్తవ వ్యయాన్ని వినియోగదారుల నుంచి రాబట్టాలని డిస్కంలు భావిస్తున్నాయి. ఈ మేరకు మార్పు చేసిన కేటగిరీల ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పరిశీలనకు డిస్కంలు సమర్పించాయి. దీని ప్రకారం ప్రభుత్వం ఇచ్చే రాయితీని పెంచకపోతే గృహ వినియోగదారులపై (అన్ని క్యాటగిరీల పరిధిలోనూ) భారం పడుతుంది.. డిస్కంలు దాఖలు చేసే వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) ప్రకారం ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్) నుంచి టారిఫ్ వర్తించేలా ప్రతిపాదిస్తాయి. ఈసారి దాఖలు చేసిన ఏఆర్ఆర్లో టారిఫ్ను 2022 ఆగస్టు నుంచి వర్తింప చేయాలని భావిస్తున్నాయి. విద్యుత్ కొనుగోలు నుంచి వినియోగదారునికి అందించే వరకు అయ్యే వ్యయాన్ని కాస్ట్ ఆఫ్ సర్వీస్ (సీవోఎస్)గా డిస్కంలు పేర్కొంటాయి. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ పోను.. మిగిలిన మొత్తాన్ని టారిఫ్గా నిర్ణయించి ఛార్జీల కింద వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేస్తాయి. డిస్కంలు దాఖలు చేసిన ఏఆర్ఆర్ ప్రతిపాదన ప్రకారం సామాన్య వర్గాలపైనే విద్యుత్ ఛార్జీల పెరుగుదల ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న టారిఫ్తో పోలిస్తే.. ప్రతిపాదించిన టారిఫ్ ప్రకారం ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగా అదనంగా భారం పడుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొత్త టారిఫ్ అమల్లోకి వస్తే (2022 ఆగస్టు నుంచి 2023 మార్చి వరకు) తొమ్మిది నెలల్లోనే రూ.919 కోట్లు గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి అదనంగా వసూలవుతుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి.
సామాన్యులపై విద్యుత్ భారం?
December 23, 2021
0
Tags