నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) నాయకుడు, రైతు సంఘం జిల్లా సహాయకార్యదర్శి గొర్ల ఇంద్రారెడ్డి(50) కుమారుడు భరత్రెడ్డి (30) ల్యాబ్ టెక్నిషియన్ కోర్సులో పీజీ పూర్తి చేసి కొంతకాలం హైదరాబాద్లో ఉద్యోగం చేశాడు. అయితే వ్యవసాయంపై ఇష్టం, తండ్రి ఆశయ సాధనలో పాలు పంచుకోవాలనే లక్ష్యంతో స్వగ్రామానికి తిరిగొచ్చేశాడు. మాడ్గులపల్లి మండలం బొమ్మకల్లోని తమ సొంత భూమిలో వ్యవసాయం చేస్తూ.. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఆదివారం భరత్ రెడ్డి తోట నుంచి ఇంటికి బైక్పై వెళ్తుండగా శెట్టిపాలెం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తండ్రి ఇంద్రారెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. కొడుకు మృతదేహాన్ని చూసి రోదిస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు. దాంతో వేములపల్లి ఎస్సై రాజు.. స్థానికుల సాయంతో అతన్ని తన వాహనంలో పట్టణంలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్టు చెప్పారు. తండ్రి కొడుకుల మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.