No title

Telugu Lo Computer
0


ఏ.యం.రాజా (అయిమల మన్మథరాజు రాజా) (జూలై 1, 1929 -ఏప్రిల్ 9, 1989) 1950వ దశకములో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. విప్రనారాయణ, చక్రపాణి, ప్రేమలేఖలు, మిస్సమ్మ పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చు తునకలు. ఈయన వివిధ భాషలలో 10,000 పాటలు పాడి, వందకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చారు. 

ఏ.యం.రాజా 1929, జూలై 1 న చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురంలో మన్మధరాజు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు.  మూడు నెలల ప్రాయంలోనే తండ్రి మరణించడంతో ఈయన రేణుకాపురానికి తరలి వెళ్ళింది. అక్కడే రాజా తన చదువు ప్రారంభించారు. 1951లో మద్రాసు పచ్చయప్ప కళాశాల నుండి బి.ఎ. పట్టా పొందారు.  ఈయన చదువుకునే రోజుల్లోనే సంగీతంపై ఆసక్తితో మూడేళ్ళపాటు సాధనచేసి నేర్చుకున్నారు.  పచ్చయప్ప కళాశాల సంగీత పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు.  1951లో కుమారి సినిమాకు నేపథ్యగాయకునిగా పనిచేయటానికి ఒప్పందం కుదిరింది. ఆ తరువాత సంసారంలో సినిమాలో పాడారు.  ఆ తరువాత అప్పట్లో విడుదలైన దాదాపు సినిమాలన్నింటిలో రాజా గొంతు వినిపించేది. ఈయన గాత్రం 1954, 1955 సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో విపరీతంగా విహారం చేసింది.

రాజా, గాయని జిక్కీని, ఎం.జీ.రామచంద్రన్ హీరోగా నటించిన జెనోవా సినిమా సెట్స్‌లో కలిశారు.  జిక్కిని వివాహం చేసుకున్న సమయంలో వీరిద్దరూ పాడిన ప్రేమలేఖలు సూపర్ హిట్ కావటం ఒక విశేషం. వీరికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రాజా సరదాగా నటించి, పాడిన హాస్యరస చిత్రం పక్కింటి అమ్మాయి, అశ్వత్థామ స్వరకల్పనలో రూపొందిన ఆ చిత్రంలోని గీతాలు హాయి గొలిపే లలిత గాన మాధుర్యానికి సంకేతాలు. అలాగే అమర సందేశం గీతాలు కూడా రాజా శక్తిని నిరూపించాయి. శోభ, పెళ్ళి కానుక చిత్రాలకు, మరికొన్ని తమిళ చిత్రాలకు ఏ.యం.రాజా సంగీత దర్శకత్వం వహించారు. పెళ్ళి కానుక లోని నేపథ్య సంగీతం కూడా ఎంతో భావగర్భితంగా వుండి చిత్ర విజయానికి దోహదం చేసాయి.

ఈయన కన్యాకుమారి జిల్లాలోని ఒక గుడిలో సంగీతకచ్చేరి చేసి తిరిగి వస్తుండగా తిరునల్వేలి జిల్లాలోని వల్లియూరులో జరిగిన రైలు ప్రమాదంలో 1989, ఏప్రిల్ 9న మరణించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)