తమ వద్ద మిగిలిపోయిన 8 కోట్ల టీకాలను వివిధ దేశాలకు ఇస్తామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటన ఆకర్షణీయంగా కనిపించినా దాని వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు. పేద దేశాల ప్రజలకు నేరుగా కలిగే ప్రయోజనము కన్నా టీకా దౌత్యం ద్వారా వ్యూహాత్మక లబ్ది పొందేందుకే బైడెన్ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందంటున్నారు. ఆసియాకు సరఫరా చేసే 70 లక్షల టీకాలలో భారత్ లభించేది 10 లక్షల టీకాలు మాత్రమేనని విదేశీ వ్యవహారాల విశ్లేషకుడు కుమార్ సంజయ్ సింగ్ తెలిపారు.
కొవిడ్ వ్యాక్సిన్లు తయారవుతున్నప్పుడే అమెరికా తన అవసరాలకంటే ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చింది. తమ మొత్తం జనాభాకు టీకాలు పూర్తయినా కూడా భారీ స్థాయిలో... మిగిలిపోయేంతగా నిల్వలు సమకూర్చుకుంది. వృథాగా వాటిని నిల్వ ఉంచుకోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బైడెన్ ప్రభుత్వం మిగులు టీకాలను ప్రపంచానికి పంచాలని నిర్ణయం తీసుకుంది. తన వద్ద అవసరానికంటే అధికంగా మిగిలిపోయిన 8 కోట్ల డోసుల టీకాలను ప్రపంచ దేశాలకు పంచటానికి అమెరికా ముందుకొచ్చింది. తొలి విడతగా 2.5 కోట్ల డోసుల్లో 1.9 కోట్ల డోసులను దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు అందజేస్తారు. వీటిలో 60 లక్షల డోసులను లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలకు; 70 లక్షల టీకాలను దక్షిణాసియా, ఆగ్నేయాసియాకు పంపి... ఆఫ్రికాకు 50 లక్షల డోసులు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రకటించారు. మిగిలిన 60 లక్షల టీకాలను కొవిడ్ అధికంగా ఉన్న, తీవ్రంగా దెబ్బతిన్న దేశాలైన భారత్, మెక్సికోలతో పాటు... తమ పొరుగుదేశం కెనడా, మిత్రదేశం దక్షిణ కొరియాలకు నేరుగా పంపిస్తామని బైడెన్ వివరించారు.