ముళ్ళపూడి వెంకటరమణ

Telugu Lo Computer
0


ముళ్ళపూడి వెంకటరమణ (జూన్ 28, 1931 - ఫిబ్రవరి 24, 2011) ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశారు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యారు. ఈయన వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి అనే పుస్తక రూపంలో వెలువడింది.

బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుండి పంచదార చిలక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళిపుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం వంటి సినిమాలకు రచయిత. 1995లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ నుండి రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం అందుకొన్నారు. 

ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్ 28 న తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో జన్మించారు. ఇతని అసలు పేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవారు.  వారి పూర్వీకులు బరంపురానికి చెందినవారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించారు. దాంతో  కుటుంబం ఇబ్బందులలో పడింది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో మద్రాసు వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్.స్కూలులో చదివారు. 7, 8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్ దాకా కేసరీ స్కూలులోను చదివారు. పాఠశాల విద్యార్థిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించారు. హాబీగా పద్యాలు అల్లేవారు. నాటకాలలో వేషాలు వేసేవారు.

1945లో "బాల" పత్రికలో రమణ మొదటి కథ "అమ్మ మాట వినకపోతే" అచ్చయ్యింది. అందులోనే "బాల శతకం" పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే "ఉదయ భాను" అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్ అయిపోయారు. మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి, వచ్చిన డబ్బులతో సైక్లోస్టైల్ మెషిన్ కొన్నారు. ఆ పత్రికకు రమణ ఎడిటర్. చిత్రకారుడు బాపు. విషయ రచయిత మండలీక శాస్త్రి. ఆర్థిక ఇబ్బందుల వలన ఎస్సెల్సీతో చదువు ఆపిన రమణ చిన్నా చితకా ఉద్యోగాలు చేశారు. 1954లో ఆంధ్ర పత్రిక దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరారు. ఆంధ్రపత్రికలో పని చేసేటపుడే బుడుగు వ్రాశారు.

దాదాపు ముళ్ళపూడి రచనలన్నీ బాపు బొమ్మల కొలువులు కూడా అని చెప్పవచ్చును.

ముళ్ళపూడి వెంకటరమణ రచనలలో ప్రసిద్ధమైనవి కొన్ని: బుడుగు - చిన్నపిల్లల భాష, మనస్తత్వం, అల్లరి గురించి హాస్య ప్రధానమైన బొమ్మలతో కూడిన రచన

ఋణానందలహరి (అప్పుల అప్పారావు - అప్పుల ప్రహసనం

విక్రమార్కుని మార్కు సింహాసనం - సినీ మాయాలోక చిత్ర విచిత్రం

గిరీశం లెక్చర్లు - సినిమాలపై సెటైర్లు

రాజకీయ బేతాళ పంచవింశతి - రాజకీయ చదరంగం గురించి

ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిల ప్రేమాయణం -

అయితే ముళ్ళపూడి రచనలు పుస్తకాల రూపంగా కాక చెదురుమదురుగా పత్రికలలో వచ్చినవి ఎక్కువ. అవే కాక సినిమా కథలు, సంభాషణలు ఉండనే ఉన్నాయి. ముళ్ళపూడి సాహిత్యాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 8 సంపుటాలుగా ప్రచురించారు. అవి

కథా రమణీయం - 1 : సీతా కళ్యాణం, ఇద్దరమ్మాయిలూ ముగ్గురబ్బాయిలూ, జనతా ఎక్స్‌ప్రెస్, రాజకీయ బేతాళ పంచవింశతి, ఇతర కథలు

కథా రమణీయం - 2 : ఋణానంద లహరి, కానుక, రాధాగోపాలం, సాక్షి, ఆకలీ-ఆనందరావు, విమానం కథ, ఇతర కథలు

బాల రమణీయం : బుడుగు

కదంబ రమణీయం - 1 : నవ్వితే నవ్వండి, పీఠికలు, వ్యాసాలు, ఇతర రచనలు

కదంబ రమణీయం - 2 : గిరీశం లెక్చర్లు, కృష్ణలీలలు, వ్యాసాలు, ఇతర రచనలు

సినీ రమణీయం - 1 : చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు, స్వదేశీ విదేశీ చిత్రాలపై సమీక్షలు, విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు

సినీ రమణీయం - 2 : కథానాయకుని కథ (అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర), చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు

అనువాద రమణీయం : 80 రోజుల్లో భూప్రదక్షిణ, పిటి 109

కోతి కొమ్మచ్చి: ఆయన జీవిత చరిత్ర. స్వాతి పత్రికలో ప్రచురితమైంది.

ఇంకా, ఇద్దరు మిత్రులు (వెండితెర నవల), తిరుప్పావై దివ్య ప్రబంధం మేలుపలుకుల మేలుకొలుపులు, రమణీయ భాగవత కథలు, రామాయణం (ముళ్ళపూడి, బాపు), శ్రీకృష్ణ లీలలు

సినిమా కథ, మాటలు : సాక్షి, పంచదార చిలక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళి పుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధా కల్యాణం, రాధాగోపాలం, జేబుదొంగ

Post a Comment

0Comments

Post a Comment (0)