వైరస్ను కట్టడి చేశామని ఆనందించేలోపే చైనాలో మళ్లీ కొత్త కేసులు నమోదవుతుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గాంజావ్ నగరంలో 20 కొత్త కేసులు బయటపడటంతో అప్రమత్తమైన ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించింది. తదుపరి ఆదేశాల వరకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశించింది.
1.5 కోట్ల మంది నివాసముండే గాంజావ్ నగరంలో వారం రోజుల్లో 20 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య చిన్నదే అయినప్పటికీ మహమ్మారిని అదుపుచేశామని ఆనందిస్తున్న అధికారుల్లో ఆందోళన రేకెత్తించింది. గత వేరియంట్ల కంటే ఈ కొత్త వేరియంట్ మరింత ప్రమాదకరమైనదని, చాలా ఉద్ధృతంగా ఉందని చైనా అధికారులు వెల్లడించినట్లు గ్లోబల్ టైమ్స్ వార్తాపత్రిక పేర్కొంది.
విదేశాల నుంచి వస్తున్న వారిలో ప్రతిరోజు కొన్ని కేసులు నమోదవుతున్నాయి. ఇద్దరు స్థానికులతోపాటు, దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో మరో 14 మందికి కొత్త రకం వైరస్ సోకినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.