ఐఏఎస్‌ అధికారికి నోటీసులు !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని బ్యూరోక్రాట్‌ల నియంత్రణ, పోస్టింగ్‌పై కేంద్రంతో జరిగిన తగాదా కేసులో సుప్రీం కోర్టు ఆప్‌ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం రంగం చేసింది. అదీగాక సుప్రీం కోర్టు నుంచి ఈవిధంగా తీర్పు వెలువడిన వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అవినీతి అధికారులను తొలగించి కష్టపడి పనిచేసే అధికారులను తీసుకొచ్చేలా బదిలీలు ఉంటాయని ప్రకటించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీ, ఐఏఎస్‌ అధికారి ఆశిష్‌ మోర్‌ పదవీచ్యుత్తులయ్యారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం బదిలీ ఉత్తర్వును ఉల్లంఘించిన ఐఏఎస్‌ అధికారి ఆశిష్‌ మోర్‌కు ఈ నెల 13న షోకాజ్‌ నోటీసులు పంపించింది. ఆ అధికారి సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించనందుకు గానూ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా యోచిస్తున్నట్లు తెలిపింది. దీనిపై 24 గంటల్లో ఆశిష్‌ మోర్‌ నుంచి సమాధానం కూడా కోరింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు సేవల శాఖ(సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌) మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ..కొత్త అధికారిని ఆయన స్థానంలో బదిలీ చేసేందుకు ఫైల్‌ సమర్పించమని సేవల కార్యదర్శి ఆశిష్‌ మోర్‌ని ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఆయన మంత్రి కార్యాలయానికి తెలియజేయకుండా సచివాలయానికి వెళ్లిపోయారని ఆరోపించారు. ఫోన్‌ని కూడా స్విచ్‌ ఆఫ్‌లో పెట్టుకుని పరారిలో ఉన్నారని మండిపడ్డారు. ఆ అధికారికి ఈ విషయాన్ని అధికారికంగా ఆయన వాట్సాప్‌, ఈమెయిల్‌ ద్వారా తెలియజేసినప్పటికీ అతని నుంచి ఎటువంటి స్పందన లేదని చెప్పారు. ఆయన బదిలీ అయ్యేందుకు సిద్ధంగా లేరని కూడా ఆరోపించారు. మోర్‌ మే 21 2015 నాటి హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను ఇంకా పక్కన పెట్టలేదని సూచిస్తూ.. షోకాజ్‌ నోటీసులు పంపినట్లు మంత్రి సౌరబ్‌ భరద్వాజ్‌ పేర్కొన్నారు. దీనిపై త్వరితగతిన ఆశిష్‌ మోర్‌ వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, సేవల నిర్వహణపై ఢిల్లీ ప్రభుత్వానికి శాసన కార్యనిర్వాహక అధికారాలు ఉన్నాయని గతవారమే సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఢిల్లీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయని అధికారులపై ఈ విథంగా కఠిన చర్యలు తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)