పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు నుంచి నిధుల ఖర్చు వరకు కేంద్రం తీరుపై విమర్శలే. అప్పట్లో ప్రధాన మంత్రి సహాయ నిధి ఉండగా.. అది కాదని పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్గా 'పీఎం కేర్స్ ఫండ్ సంస్థ'ను మార్చి 27, 2020లో రిజిస్టర్ చేయించారు. వచ్చిన నిధులతో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం రూ.12,691.82 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇందులో రూ.535.44 కోట్లు విదేశాల నుంచి వచ్చాయి. అయితే, నిధుల వినియోగంలో పారదర్శకత, రికార్డుల నిర్వహణ లేదని, పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. కరోనా సంక్షోభం ముగిసినా.. కనీసం 50 శాతం విరాళాలను కూడా ప్రజల కోసం ఖర్చు చేయలేదని ఆర్టీఐ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఆర్టీఐ ప్రకారం సమాచారం అడిగినా.. ఇచ్చేందుకు కేంద్రం ససేమిరా అంటుంది. ఎన్జీవోలు విదేశీ నిధుల లెక్కలు చెప్పడం లేదని వాటి ఎఫ్సీఆర్ఏ అనుమతి రద్దు చేస్తున్న కేంద్రం.. మరోపక్క తన ఆధ్వర్యంలో నడిచే పీఎం కేర్స్ ఫండ్ పొందిన విదేశీ నిధులకు ఎందుకు లెక్కలు చెప్పదని ఆర్టీఐ యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు. పీఎం కేర్స్ ఫండ్ తో వెంటిలేటర్లు, వలస కార్మికుల సంక్షేమం, తాత్కాలిక కొవిడ్ దవాఖానల ఏర్పాటు లాంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు మోడీ ప్రభుత్వం చెప్పింది. కానీ వాటికి సంబంధించిన రుజువులు, బిల్లులు మాత్రం ఎందుకు చూపడం లేదని, విరాళాల రూపంలో వచ్చిన నిధులను ఖర్చు విషయంలో అంత గోప్యత ఎందుకని ఎన్జీవోలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
పీఎం కేర్స్ నిధులపై అంత గోప్యతెందుకు ?
May 10, 2023
0
Tags