మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం ఘటనలో తెలంగాణ లోని సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన నలుగురు చనిపోయారు. చనిపోయిన నలుగురూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు. మృతులు ఎరుకుల కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వచ్చి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నదమ్ములు నలుగురూ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గుజరాత్లోని సూరత్కు వెళ్లారు. ఐదు రోజుల క్రితం వీరి సొంతూరు చౌటపల్లిలో బంధువు ఎరుకల రాములు మృతి చెందారు. దీంతో అతడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఈ నలుగురూ తమ కుటుంబసభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. కుటుంబ సభ్యులను చౌటపల్లిలోనే ఉంచి అన్నదమ్ములు తిరిగి సూరత్కు నిన్న(మంగళవారం) కారులో బయల్దేరారు. అదే రోజు రాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వ్యక్తులు మృతి
May 24, 2023
0
Tags