ఆంధ్రప్రదేశ్ లో ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా అనంతపురం రేంజ్‌ పోలీసులు ఏసీ హెల్మెట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఏసీ హెల్మెట్‌లు హైదరాబాద్‌ రాచకొండ పోలీసులు వినియోగించడాన్ని తెలుసుకున్న రాష్ట్ర పోలీసులు దీనిపై దృష్టి  సారించారు. అనంతపురం రేంజ్‌ డిఐజి అమ్మిరెడ్డి సదరు కంపెనీ వారిని పిలిపించి వివరాలు సేకరించారు. వీటి పనితీరుపై కంపెనీ ప్రతినిధులు డెమో నిర్వహించి చూపించారు. దీంతో శాంపిల్స్‌ తీసుకుని ట్రాఫిక్‌ సిబ్బందికి ఇచ్చి వీటి పనితీరుపై ఫీడ్‌ బ్యాక్‌ కోరుతున్నారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఏసీ హెల్మెట్‌లు సత్ఫలితాలిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. సదరు కంపెనీ నుంచి ఒక్కొక్కటి రూ. 7,500కు కొనుగోలు చేసేలా ఒప్పందం చేశారు. అనంతపురం రేంజ్‌ పరిధిలోని అనంతపురం, సత్యసాయి జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కలిపి 25 చొప్పున మొత్తం 100 ఏసీ హెల్మెట్‌లు ఆర్డర్‌ పెట్టారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలకు మాత్రం కియా కంపెనీ స్పాన్సర్‌ చేస్తోంది. మామూలుగానే వేసవిలో ట్రాఫిక్‌ సిబ్బందికి అందించే టోపీ, కళ్ళజోడు, వాటర్‌ బాటిల్‌, మాస్క్‌లతో కూడిన కిట్‌లతోపాటుగా ఈ ఏసీ హెల్మెట్‌లు అందిస్తున్నారు. ఇక తిరుపతి, చిత్తూరు జిల్లాలకు మాత్రం అక్కడి ఎస్పీలు స్పాన్సర్‌ కోసం అన్వేషణలో ఉన్నారు. అనంతపురం రేంజ్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఏసీ హెల్మెట్‌ల గురించి తెలుసుకున్న ఇతర జిల్లాలు ఇప్పుడు వీటిపై దృష్టి సారించాయి. ఆయా జిల్లాల ఎస్పీలు తమ పరిధిలోని ట్రాఫిక్‌ సిబ్బందికి అందించేందుకు ముందుకు వచ్చి హెల్మెట్‌లు ఆర్డర్‌ పెట్టేందుకు స్పాన్సర్స్‌ను వెతుకుతున్నారు. ఇదిలావుండగా త్వరలో హెల్మెట్‌పై ఇన్‌బిల్ట్‌ కెమెరాను జోడించేందుకు కంపెనీ మార్పులు చేస్తోంది. తద్వారా పోలీసులు, ప్రజలు ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించిన సందర్భాలను రికార్డ్‌ చేయడం జరుగుతుంది. ఇప్పటికే పోలీసుశాఖలో బాడీ వార్న్‌ కెమేరాలు వినియోగంలో ఉన్నాయి. వీటి తరహాలోనే ఇక హెల్మెట్‌ కెమేరాలు రానున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)