ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని విచక్షణ కోల్పోయి బీజేపీ నేత భర్త దీపక్ సింగ్ను చితక్కొట్టారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే సహా ఆయన అనుచరులను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటన అమేథీ జిల్లాలోని గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో జరిగింది. బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి రష్మీ సింగ్ భర్త దీపక్ సింగ్పై సమాజ్వాదీ పార్టీ శాసనసభ్యుడు రాకేష్ ప్రతాప్ సింగ్ దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీపక్ సింగ్ అతని మద్దతుదారులు తన మద్దతుదారుల్లో కొంతమందిపై దాడి చేశారని, అందుకే తాను పోలీసు స్టేషన్ ఎదుట నిరసనకు దిగానని, అయితే పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ ఆరోపించారు. దీపక్ సింగ్ పోలీసు స్టేషన్కు వచ్చి అక్కడ నిరసనలో కూర్చున్నప్పుడు తనను అసభ్యంగా తిట్టాడని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. దీంతో తాను సహనం కోల్పోయి దాడి చేసినట్లు ఎమ్మెల్యే పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ పరిస్థితి అకస్మాత్తుగా చేయి దాటిపోయిందని, ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఎదురుపడ్డారని, దాడిని తప్పించేందుకు పోలీసులకు చాలా తక్కువ సమయం ఉందని పోలీసు అధికారి అన్నారు. అయితే దాడికి పాల్పడి వారి సమస్యను ఇప్పుడు పరిష్కరించామని, ఇద్దరిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి వెల్లడించారు.
పోలీస్ స్టేషన్లోనే బీజేపీ నేత భర్తను కొట్టిన ఎమ్మెల్యే !
May 10, 2023
0
Tags