పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్టు ఇవ్వండి !

Telugu Lo Computer
0


టీఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వానికి మూడు వారాల గడువును విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. టీఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎన్‌ఎస్‌యుఐ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తు సక్రమంగా జరగట్లేదన్న ఆధారాలు పిటిషనర్లు సమర్పించలేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వం తరపున ఎజి బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఇది రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్ అని, లీకేజీ కేసులో సిట్ సమగ్రంగా దర్యాప్తు జరుపుతోందని పేర్కొన్నారు. కేవలం ఇద్దరినే అరెస్టు చేశారని పిటిషనర్లు అంటున్నారని, కానీ ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారని కోర్టుకు వివరించారు. విచారణ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు హైకోర్టుకు హాజరయ్యారు. టిఎస్‌పిఎస్‌సి లీకేజీ కేసుపై సమగ్ర విచారణ జరపాలని ఎఐసిసి లీగల్ సెల్ ఛైర్మన్ వివేక్ ధన్కా అన్నారు. ఇద్దరు నిందితులకే సంబంధం ఉందని ఐటీ మంత్రి చెప్పారని, కేసు మొదటి దశలోనే ఇద్దరికే ప్రమేయం ఉందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దర్యాప్తు విషయంలో పోలీసులపై నమ్మకం లేదని అన్నారు. వ్యాపమ్ స్కామ్ తీర్పు ప్రతిని వివేక్ ధన్కా హైకోర్టుకు సమర్పించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)