హైదరాబాద్, గోషామహల్ ఎంఎల్ఎ రాజాసింగ్పై ముంబయిలో కేసు నమోదు అయింది. ముంబయిలో జనవరి 29వ తేదీన జరిగిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై స్థానిక పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. రాజాసింగ్పై ఐపిసి సెక్షన్ 153 ఎ 1(ఎ) కింద కేసులు నమోదైంది. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్పై ఆరోపణలు ఉన్నాయి. జనవరి 29న ముంబయిలోని హిందూ సకల్ సమాజ్ మోర్చాలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేసినందుకు బిజెపి నుంచి సస్పెండ్ అయిన ఎంఎల్ఎ రాజా సింగ్పై గ్రేటర్ ముంబయి పోలీసులు దాదర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మత సామరస్యానికి విఘాతం కలిగించారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సకల్ హిందూ సమాజ్ జనవరి 29న ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతిని కోరింది. శివాజీ పార్క్ నుంచి దాదర్లోని మహారాష్ట్ర స్టేట్ లేబర్ వెల్ఫేర్ బోర్డు వరకు సకల్ హిందూ సమాజ్ ఆధ్వర్యంలో మార్చ్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. మహిళలను దుర్వినియోగం చేయడం, వారి భద్రత, గౌరవానికి ఆటంకం కలిగించడాన్ని నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. మార్చ్కు పోలీసులు అనుమతించారు, నిర్వహకులు ర్యాలీ కూడా నిర్వహించారని, అందులో ఎంఎల్ఎ రాజాసింగ్ రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారని, ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని పేర్కొన్నారు.
ముంబయిలో రాజాసింగ్పై కేసు నమోదు
March 30, 2023
0
Tags