రూ.2,000 దాటితే ఛార్జీల మోత !

Telugu Lo Computer
0


డిజిటల్ చెల్లింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం ఇప్పుడు వాటిపై అదనపు ఛార్జీల భారాన్ని మోపాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసిన సిఫారసులను యధాతథంగా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ 1వ తేదీన ఆరంభం అయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఆర్థిక, వ్యాపారి లావాదేవీలపై అదనపు ఛార్జీలను వసూలు చేయాలంటూ ఎన్సీపీఐ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఓ సర్కులర్‌ను జారీ చేసిందా సంస్థ. దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా వినియోగదారులు జరిపే బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీలు, నగదు చెల్లింపులన్నింటిపైనా ఈ అదనపు ఛార్జీలను వసూలు చేయాలని సూచించింది. ఎన్సీపీఐ చేసిన సిఫారసులను యధాతథంగా అమలు చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. ఎన్సీపీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం- యూపీఐ ద్వారా 2,000 రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు చేసిన వినియోగదారులపై 1.1 శాతం అదనపు ఛార్జీలను ఎన్సీపీఐ వసూలు చేస్తుంది. అదనపు ఛార్జీలు అమల్లోకి వచ్చిన తరువాత ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌ను జారీ చేసేవారు రెమిటర్ బ్యాంక్‌కు వాలెట్-లోడింగ్ సర్వీస్ ఛార్జ్‌గా సుమారు 15 బేసిస్ పాయింట్లను చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతా, పీపీఐ వాలెట్ మధ్య పీర్-టు-పీర్  లేదా పీర్-టు-పీర్-మర్చంట్ లావాదేవీలపరంగా ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇలా యూపీఐ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇతర రంగాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తుంది. ఇందులో ఇంధనం-0.5 శాతం, టెలికం, యుటిలిటీస్/పోస్టాఫీస్, విద్య, వ్యవసాయానికి- 0.9 శాతం, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, రైల్వేలకు ఒక శాతాన్ని బదలాయిస్తుంది. ఈ అదనపు ఛార్జీల వసూలుపై సెప్టెంబర్ 30వ తేదీన ఎన్సీపీఐ సమీక్ష నిర్వహిస్తుంది. దీన్ని మున్ముందు అమలు చేయాలా? వద్దా? లేక అదనపు ఛార్జీలను మరింత పెంచాలా? లేక తగ్గించాలా?, అదనపు ఛార్జీల పరిధి మొత్తం.. వంటి అంశాలను సమీక్షిస్తుంది. ఎన్సీపీఐ ద్వారా ఈ ఏడాది జనవరిలో 12.98 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో ఈ సంఖ్య 12.36 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)