స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ !

Telugu Lo Computer
0


పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో విమానం టేకాఫ్‌ సమయంలో ఇంజిన్‌ బ్లేడ్లు విరిగడంతో విమానాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు.  ఆదివారం అర్ధ రాత్రి తర్వాత 1.09 గంటలకు స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌ నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరింది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌ అయిన సమయంలో ఆ విమానం ఎడమ ఇంజిన్‌లోని బ్లేడ్లు విరిగాయి. పైలట్లు వెంటనే దీనిని గ్రహించారు. ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. 1.27 గంటలకు తిరిగి ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన178 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఆ విమానంలో ఉన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు స్పైస్‌జెట్ తెలిపింది. దీంతో బ్యాంకాక్‌ వెళ్లేందుకు సోమవారం ఉదయం 7 గంటలకు ఆ విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయినట్లు చెప్పింది. అయితే తెల్లవారుజామున 2 గంటల వరకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ పరిస్థితి కొనసాగినట్లు స్పైస్‌జెట్ వెల్లడించింది. ఇంజిన్‌ బ్లేడ్లు విరిగిన విమానాన్ని బే నుంచి వాహనంతో లాక్కెళ్లినట్లు వివరించింది. టేకాఫ్‌ సమయంలో విమానం ఇంజిన్‌ బ్లేడ్లు విరిగినట్లు దర్యాప్తులో గ్రహించామని పేర్కొంది. ఈ విషయాన్ని డీజీసీఏకు నివేదించినట్లు వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)