జర్నలిస్టుని చెట్టుకు కట్టేసి కొట్టిన దుండగులు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ప్రకాశ్ యాదవ్ అనే ఓ యువకుడు ఒక టీవీ ఛానెల్, ఆన్‌లైన్ న్యూస్ ఔట్‌లెట్‌కు జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు. తన విధులు నిర్వర్తించిన అనంతరం తన స్వగ్రామం కోట్‌గావ్‌కి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. ఇంతలో నారాయణ్ యాదవ్ అనే ఓ వ్యక్తి ప్రకాశ్ బండిని అడ్డగించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, నారాయణ్ బూతులు తిడుతూ ప్రకాశ్‌పై చెయ్యి చేసుకోబోయాడు. ప్రకాశ్ అతడ్ని అడ్డుకోబోయాడు. ఇంతలో నారాయణ్ సోదరుడు నరేంద్ర యాదవ్, ఓమ్ ప్రకాశ్ అనే మరో వ్యక్తి అక్కడికి చేరుకున్నారు. ఆ ముగ్గురు ప్రకాశ్‌ని రౌండప్ చేసి కొట్టారు. అంతటితో ఆగకుండా ఓ చెట్టుకు కట్టేసి కొట్టి,  అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. అనంతరం అతని కట్టు విప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అనంతరం ప్రకాశ్ పోలీసుల్ని ఆశ్రయించాడు.  తన ఫిర్యాదులో ప్రకాశ్ పేర్కొన్న ఆ వాగ్వాదానికి సంబంధించి గతంలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఎవరైతే వాగ్వాదానికి దిగారో వాళ్లే ఆ వీడియోని రికార్డ్ చేశారు. తామేదో గొప్ప పని చేస్తున్నామన్న ఉద్దేశంతో ఆ పని చేశారు. కానీ అదే వాళ్లను జైలుపాలు చేసింది. ఆ ఘటనపై కేసు నమోదవ్వగా పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు ఇప్పుడు ప్రకాశ్‌పై మళ్లీ ఆ వాగ్వాదం విషయంపైనే దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)