ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్​

Telugu Lo Computer
0


ఆంధ్రప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్​ 1​ అమలును నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జీవో నెంబర్​ 1​ని నిలిపివేసి హైకోర్టు పెద్ద తప్పు చేసిందని, సర్కారు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ జనవరి 2వ తేదీన ప్రభుత్వం జీవో నెంబర్​ వన్​ను తీసుకొచ్చింది. రాజకీయ పార్టీల గొంతు నొక్కేందుకు తెచ్చిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 12న హైకోర్టు విచారణ జరిపింది. జీవో నెంబర్​ వన్​ను పోలీసు చట్టం సెక్షన్‌ 30కి విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. జీవోను ఈ నెల 23 వరకు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణను ఈనెల 20కి వాయిదా వేసిన హైకోర్టు.. కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ సుప్రీంకోర్టులో ఎస్​ఎల్​పీ దాఖలు చేశారు. జీవో నెంబర్​ వన్​ ద్వారా బహిరంగ సమావేశాలను నిషేధించలేదని, సహేతుకమైన షరతులు విధించడం, ప్రత్యామ్నాయ స్థలాలు సూచించడంపై పోలీసులకు అనుమతిచ్చామని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. విచారణ ప్రాథమిక దశలోనే జోక్యం చేసుకుని జీవో అమలును నిలిపేయడంలో.. హైకోర్టు పొరపాటు చేసిందని స్పష్టం చేసింది. కౌంటరు వేసేందుకు ప్రభుత్వానికి సమయం ఇచ్చి ఉండాల్సిందని అందులో పేర్కొంది. పౌరుల భద్రత నిమిత్తం తీసుకొచ్చిన జీవో అమలును నిలిపేయాల్సిన అవసరం లేదంది. అత్యవసర విచారణ జరపాలని సంక్రాంతి వెకేషన్‌ బెంచ్‌ ముందు పిటిషనరు చేసిన అభ్యర్థనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. అత్యవసరంగా విచారణ జరిపేందుకు కావాల్సిన వాదనలు ఆ పిల్‌లో లేవని స్పష్టం చేసింది. పాలసీ , పరిపాలనా సంబంధమైన విషయాలను వెకేషన్‌లో విచారించడానికి వీల్లేదంది. వెకేషన్‌ బెంచ్‌ ఆ పిల్‌పై విచారణ జరపకుండా ఉండాల్సిందని పేర్కొంది. రోస్టర్‌ పరిధిలోని వ్యవహారం కాదని స్పష్టం చేసింది. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు చట్ట విరుద్ధమైనవని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పోలీసు చట్టం సెక్షన్‌ 30కి విరుద్ధంగా ఉందని హైకోర్టు పొరపాటు పడిందని.. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను వెంటనే ఎత్తివేయకపోతే.. పోలీసుల నియంత్రణ లేకుండా రహదారులపై రాజకీయ ర్యాలీలు, రోడ్‌షోలు, పెద్ద స్థాయిలో బహిరంగ సభలు నిర్వహిస్తారని తెలిపింది. తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయిన ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని కోరింది. మరో రెండు రోజుల్లో హైకోర్టులో ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో ఈ పిటిషన్‌ను వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)