ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ దీవికి చేరువగా గురువారం ఉదయం అల్పవాయుపీడనం ఏర్పడినట్లు వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. ఈశాన్య రుతుపవనాల తీవ్రత, ఉపరితల ఆవర్తనం కారణంగా కురిసిన భారీ వర్షాల నుండి తేరుకుంటున్న తమిళనాడు లోని ఉత్తరాది జిల్లాలలో ఈ నెల 20 నుండి రెండు రోజులపాటు కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అ మేరకు బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పవాయుపీడనం రెండు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారి, పడమటి దిశగా, వాయవ్య బంగాళాఖాతం వైపు వేగంగా కదలనుందని తెలిపారు. దీనితో కడలూరు, కాంచీపురం నాగపట్టినం, తిరువళ్లూరు, తిరువారూరు జిల్లాల్లోనూ, కారైక్కాల్, పుదుచ్చేరి ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తాయని వివరించారు. అల్పపీడనం కారణంగా గురువారం రాత్రి నుండి సముద్రతీర ప్రాంతాల్లో గంటకు 45 నుండి 50. కి.మీల వేగంతో పెనుగాలులు వీస్తాయని తెలిపారు. వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాలోనూ 48 గంటలలోగా చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
November 18, 2022
0