పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు !

Telugu Lo Computer
0


శీతాకాలం వచ్చిందంటే చలితో పాటు పొగమంచు వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. పొగమంచు కారణంగా 2020,2021 లోని నగర పరిధిలో సుమారు వంద మంది మరణించారని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. నగర శివార్లు, ఔటర్‌ రింగు రోడ్డుపై సాయంత్రం దాటాక వాహనాల రద్దీ పెరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాదారులు విశ్రాంతి లేకుండా వేగంగా వెళ్తుంటారు. మరికొందరు విశ్రాంతి కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపేస్తుంటారు. పొగమంచు వల్ల ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. శీతాకాలంలో ఏటా సుమారు 400 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కార్తికమాసం, క్రిస్మస్‌, సంక్రాంతి ఇలా వరుస పండుగలు ఉన్నాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ మంది విహారయాత్రలు, ఆలయాలకు వెళ్తుంటారు.  ఉదయం పూట వెళ్లి రాత్రికి తిరుగు ప్రయాణమవుతారు. కానీ ఎక్కవ మందికి చలికాలంలో డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవడం.. వాతావరణంలో వచ్చే మార్పును అవగతం చేసుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. పొగ మంచు వల్ల రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే సురక్షిత ప్రదేశంలో వాహనాలు నిలిపివేయాలని చెబుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణాలు వాయిదా వేయడమే మంచిదని.. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)