వైకాపా నాయకుడు రామకృష్ణారెడ్డి హత్య దారుణమని ఆగ్రోస్ ఛైర్మన్ నవీన్ నిశ్చల్, సీనియర్ నాయకుడు కొండూరు వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. హిందూపురంలో శనివారం రాత్రి దారుణహత్యకు గురైన వైకాపా అసమ్మతి నేత, నియోజకవర్గ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి (46) మృతదేహాన్ని వారు పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న హిందూపురంలో హత్యలకు దిగడం దారుణమని పేర్కొన్నారు. ఇది పోలీసుల వైఫల్యమని వారు ఆరోపించారు. రామకృష్ణారెడ్డి హత్య విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన్ని తలుచుకొంటూ పలువురు విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్ద, చౌళూరులో పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్సింగ్ శనివారం అర్ధరాత్రి 12.45 గంటలకు హిందూపురం చేరుకున్నారు. ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించి వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రామకృష్ణారెడ్డి తల్లి, ఇతర కుటుంబ సభ్యులను ఆసుపత్రిలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్సింగ్ పరామర్శించారు. వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎస్పీతో మాట్లాడారు. స్థానిక పోలీసులపై తమకు నమ్మకంలేదని, మీరే నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు.
రామకృష్ణారెడ్డి హత్య దారుణం
October 09, 2022
0