మన సినిమాలు చైనాలో ఎక్కువ బిజినెస్ చేస్తున్నాయని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ (ఎంఐబీ) సెక్రటరీ అపూర్వ చంద్ర వెల్లడించారు. మన సినిమాలు మన దేశంలోనే ఎక్కువ బిజినెస్ చేసేలా చొరవ తీసుకోవల్సి ఉందని చెప్పారు. ఈ ట్రెండ్ను రివర్స్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మీడియా, ఎంటర్టెయిన్మెంట్పై ఫిక్కి నిర్వహించిన ఈవెంట్లో అపూర్వ చంద్ర పాల్గొన్నారు. ఆరేళ్ల కిందట దేశంలో 12 వేల దాకా థియేటర్లు ఉండేవని, అవి ఇప్పుడు 8 వేలకి తగ్గిపోయాయని ఆయన చెప్పారు. ఇదే టైములో చైనాలోని ఫిల్మ్ ఎగ్జిబిషన్ హాల్స్ సంఖ్య 10 వేల నుంచి ఏకంగా 70 వేలకి పెరగడాన్ని గమనించాలని పేర్కొన్నారు. మన సినిమాలు ఆ దేశంలో ఎక్కువ బిజినెస్ చేయడానికి ఇదొక కారణమని చెబుతూ, ఈ ట్రెండ్ను మనం రివర్స్ చేయాలని సూచించారు. ఇందుకు దేశంలో మరిన్ని థియేటర్లు తెరవడమే సరయిన సొల్యూషన్గా పేర్కొన్నారు. ఈ టాస్క్ను దేశంలో కొత్తగా ఏర్పాటయిన ఫిల్మ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ (ఎఫ్ఎఫ్ఓ)కి ప్రభుత్వం అప్పచెబుతున్నట్లు అపూర్వ చంద్ర వెల్లడించారు. ఇన్వెస్ట్ ఇండియా, నేషనల్ సింగిల్ విండో పోర్టల్లతో కలిసి ఎఫ్ఎఫ్ఓ ఇందుకోసం పనిచేస్తుందన్నారు. థియేటర్ ఏర్పాటు చేయడం అంటే ఒక ఇండస్ట్రీ నెలకొల్పడం లాంటిదేనని ఆయన పేర్కొన్నారు. 10 లక్షల మంది జనాభా ఉన్న మాల్దా (వెస్ట్ బెంగాల్)లో ఒక్క థియేటర్ కూడా లేకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ప్రభుత్వ చొరవతో కర్నాటకలోని చిన్న సిటీలలో గత నాలుగు నెలలలో కొత్తగా ఆరు థియేటర్లు ఏర్పాటయ్యాయని , మరిన్ని రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కిందటి వారాంతంలో రూ. 75 టికెట్ ఆఫర్ చాలా మందిని ఆకట్టుకుందని, మార్నింగ్ షోలకు సైతం జనం ఎగబడ్డారని పేర్కొన్నారు. సినిమా టికెట్ల రేట్లు సమంజసమైనవిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు అపూర్వ చంద్ర చెప్పారు. సినిమా ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
Post a Comment
0Comments
3/related/default