ఎమ్మెల్యేను ప్రశ్నించిన యువకుడిపై ఎమ్మెల్యే కేసు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల కేంద్రంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు వేపనపల్లి గ్రామానికి వచ్చారు. ఇంజినీరింగ్‌ విద్యార్థి జశ్వంత్‌ మూడో విడత విద్యాదీవెన డబ్బులు అందలేదని చెప్పగా, కారణమేంటో చెప్పాలని ఎమ్మెల్యే వాలంటీర్‌ను ప్రశ్నించారు. కొందరికి ఇంకా ఖాతాల్లో జమ కావాల్సి ఉందని వాలంటీర్‌ చెప్పారు. మూడేళ్లలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెబుతుండగా, పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలిస్తుండగా, గ్రామానికి చెందిన మరో 8 మంది తమ వాహనాలను అడ్డుపెట్టారు. ఎమ్మెల్యే అనుచరులు వారిపై దాడికి దిగారు. పోలీసులు వారించి, విడతల వారీగా వారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, తెదేపా నాయకులు భారీగా స్టేషన్‌ వద్దకు చేరుకొని, యువకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వేపనపల్లి మహిళలు జాతీయ రహదారిపై బైఠాయించారు. వైకాపా శ్రేణులు సైతం స్టేషన్‌ ఎదుట మోహరించాయి. ఆ పార్టీ మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డి కారుపై కొందరు రాళ్ల దాడి చేయడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎస్పీ రిషాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. ఎమ్మెల్యే బాబు, ఎంపీడీవో గౌరి ఇంజినీరింగ్‌ యువకుడితోపాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, తమ కార్యకర్తపై వైకాపా శ్రేణులు దాడి చేశాయని తెదేపా నాయకులు ప్రతి ఫిర్యాదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)