పశ్చిమబెంగాల్లో ఎస్ఎస్సీ స్కామ్ లో నిందితులైన మంత్రి పార్థా చటర్జీ, ఆయన సహాకురాలు అర్పితా ముఖర్జీ కి కోల్కతా సిటీ సెషన్స్ కోర్టు ఈ నెల 18 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వాదనల సమయంలో అర్పిత ప్రాణానికి ముప్పుందని ఆమె తరపున వాదిస్తున్న లాయర్ వాదించారు. అర్పితకు ఇచ్చే నీరు, ఆహారాన్ని కూడా చెక్ చేసి ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఆమెను మిగతా నిందితులతో కలిపి కాకుండా ప్రత్యేక గదిలో ఉంచాలని కోరారు. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ తరపున వాదిస్తున్న లాయర్ కూడా దీనికి మద్దతు పలికారు. అర్పిత ఫ్లాట్లలో నోట్ల కట్టలతో ఈడీకి దొరికిపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. అర్పిత ఫ్లాట్ల నుంచి 50 కోట్ల రూపాయలకు పైగా నోట్ల కట్టలు, ఐదు కేజీలకు పైగా బంగారం నగలు బయటపడటంతో కలకలం రేగింది. పరువు తీసిన పార్థాను మంత్రి పదవి నుంచి తొలగించి డబ్బుతో తమకు సంబంధం లేదని ఆ పార్టీ నేతలు వాదించారు. అయితే ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. పార్థా-అర్పిత లీలలు రోజుకొకటి బయటకు వస్తుండటంతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి దిక్కుతోచడం లేదు. శాంతినికేతన్లో అర్పితా-పార్థా పేరిట ఫామ్హౌస్, అర్పిత జీవిత భీమా పథకాలకు నామినీగా పార్థా పేరుండటం సహా అనేక విషయాలు బయటపడుతున్నాయి.
18 వరకు పార్థా చటర్జీ,అర్పిత కు జ్యుడీషియల్ కస్టడీ
August 05, 2022
0
Tags